బాబుకు షాక్: తెరాసలోకి షిండే, అదేదార్లో బోథ్ ఎమ్మెల్యే
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా జుక్కల్ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు హన్మంతు షిండే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైఖరి కారణంగానే తాను తెరాసలో చేరేందుకు సిద్ధమైనట్లు షిండే చెప్పారు. హన్మంతు షిండే ఆదివారం సాయంత్రం తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. పార్టీలో చేరే అంశంపై వారు చర్చించారు.
హన్మంతు షిండే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 2004లో తెలుగుదేశం పార్టీలో చేరారు. మొదటిసారి ఓడిపోయిన షిండే 2009 ఎన్నికల్లో గెలుపొందారు. హన్మంతు షిండే తెరాసలో చేరుతారని గత రెండేళ్లుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలను ఆయన ఖండిస్తూ వస్తున్నారు.
చివరకు ఆదివారం కెసిఆర్ను కలిసి పార్టీలో చేరేందుకు సిద్ధమని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణపై స్పష్టత లేదనే భావన కారణంగా 2014లో ఎన్నికల ఆందోళనతో ఆయన తెరాసలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా చెబుతున్నారు.
కెసిఆర్ను ఆదివారం కలిసిన షిండే మాట్లాడుతూ... కెసిఆర్ సారథ్యంలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, రెండు రోజుల్లో అధికారికంగా తెలంగాణ భవన్లో తన అనుచరులతో వచ్చి పార్టీలో చేరుతానని, తర్వాత నెలాఖరులోగా జుక్కల్లో బహిరంగ సభను ఏర్పాటు చేస్తానని, కెసిఆర్ను ఆహ్వానిస్తానని చెప్పారు.
బాబు అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక విధానాలతోనే తాను టిడిపిని వీడాలనుకున్నానని, తెలంగాణలో టిడిపి జెండాను చంద్రబాబే పీకేసుకుంటున్నారన్నారు. ఇక్కడి ప్రజాప్రతినిధులందరూ ఒక్కతాటిపైకి వస్తున్నారన,ి తెరాస ఒక్కటే తెలంగాణ ప్రజల పార్టీ అన్నారు. టిడిపిలో ఉన్న తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీని వీడి వచ్చి తెరాసలో చేరాలన్నారు.
అదే బాటలో బోథ్ ఎమ్మెల్యే నగేష్
జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే దారిలోనే అదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే నగేష్ నడిచే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. ఆయన కూడా ఒకటి రెండు రోజుల్లో కెసిఆర్ను కలిసే అవకాశాలు లేకపోలేదంటున్నారు.