చానళ్ల బ్యాన్: కేసీఆర్ ప్రభుత్వంపై కె లక్ష్మణ్ ఆగ్రహం
మీడియా ప్రసారాలను ఆపేసి ఎంఎస్వోలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారన్నారు. రాజకీయ కారణాలతో మీడియాను అణగదొక్కాలనుకోవడం, పత్రికాస్వేచ్ఛను హరించాలనుకోవడం దారుణమన్నారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడరాదని సూచించారు. గవర్నర్, కేంద్ర మంత్రులు లేఖలు రాసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
కాగా, చానల్ ప్రసారాలు ప్రజల ఆస్తి అని, దానిని నిలువరించడం సరికాదని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాది హైకోర్టులో గురువారం అన్నారు. చానళ్ల ప్రసారాల నిలిపివేత హైకోర్టులో ఉన్న విషయం తెలిసిందే. దీనిపై చానల్ తరఫు న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపించారు. చానళ్ల ప్రసార తరంగాలు ప్రయివేటు ఆస్తి కాదని, అది ప్రజల సొత్తు అన్నారు. అకస్మాత్తుగా ప్రసారాలను ఆపేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు.
ఎంఎస్ఓల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్స్ చట్టం ప్రకారం ప్రభుత్వానికి చెందిన చానళ్ల ప్రసారాల బాధ్యత తమ పైన ఉంటుందన్నారు. చానల్, ఎంఎస్ఓలకు మధ్య ఎలాంటి ఒప్పందం లేనందున ఆ చానల్ ప్రసారాలకు తమను ఆదేశించడానికి ఏ చట్టం అనుమతించదన్నారు. కాగా, ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ విలాస్ వి అఫ్జల్ పుర్కర్ పిటిషన్ పైన తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు.