వైసీపీపై మున్సిపల్ చైర్మన్ వ్యూహం.. టీడీపీలోకి కీలక నేతలు
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పట్టణంలోని టైలర్స్ కాలనీకి చెందిన వైసీపీ నేతలు కాకర్ల రంగనాథ్, జగన్నాథ్, రంగనాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పుట్లూరు రోడ్డు నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటివరకు 5వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డి వారిని శాలువాలతో సత్కరించి పార్టీలోకి ఆహ్వానించారు. తాడిపత్రి, పెద్దపప్పూరు, యాడికి మండలాల్లోని ఆయా గ్రామాల వైసీపీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సామాజికవర్గానికే ప్రాధాన్యం ఇచ్చారని, తమ సామాజికవర్గాన్ని అవమానకరంగా చూశారంటూ రంగనాథ్ మండిపడ్డారు. ప్రాధాన్యం లేనివారికి పదవులు కట్టబెట్టారని, కష్టపడినవారికి గుర్తింపు దక్కలేదన్నారు. అందుకే తాము తెలుగుదేశం పార్టీలోకి చేరాలని నిర్ణయించుకున్నామన్నారు. అస్మిత్ రెడ్డిని గెలిపించుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించారు.

తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ప్రజల నుంచి ఎంతెంత వసూలు చేశారో ఆధారాలతో సహా బయటపెడతానని రంగనాథ్ ప్రకటించారు. త్వరలోనే అందరి చిట్టా విప్పుతానని, అన్ని వివరాలను తనదగ్గర ఉన్నాయన్నారు. కాకర్ల బ్రదర్స్ గతంలో తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు. 2019 ఎన్నికల సందర్భంగా వారంతా వైసీపీలో చేరారు. తిరిగి ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరడం విశేషం. తాడిపత్రి నుంచి ఎలాగైనా తన తనయుణ్ని గెలిపించుకోవాలని ప్రభాకర్ రెడ్డి శ్రమిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో తన సహచరులుగా ఉండి ప్రస్తుతం వైసీపీలో ఉన్నవారితోను మంతనాలు సాగిస్తున్నారు. అస్మిత్ కు ఓటేయాలని కోరుతున్నారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications