ప్రజాగ్రహం - వ్యతిరేకత: "చెత్త" నిర్ణయాలు ఆపండి - సీఎం మేనమామ డిమాండ్..!!
ముఖ్యమంత్రి మేనమామ.. కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాము ఎన్నికలకు వెళ్లాల్సి ఉందని చెబుతూ..చెత్త పన్ను వసూళ్లతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని..దీనిని నిలిపివేయాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో చెత్త పన్ను వ్యవహారం పైన కొంత కాలంగా ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని నివాసం వద్ద ఇదే అంశం పైన వివాదం చోటు చేసుకుంది.
ఆ వసూళ్లు ఆపేయండి
ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే.. సీఎం బంధువు అయిన రవీంద్రనాధ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. డిమాండ్ రాజకీయంగా చర్చకు కారణమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయని చెప్పిన ఎమ్మెల్యే తాము ఎన్నికలకు వెళ్లాల్సి ఉందన్నారు. క్లాప్ పథకం కింద సేవలు అందించకుండా మూడు ..నాలుగు నెలల బకాయిలలతో సహా చెత్త పన్ను వసూలు చేయటం పైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని సమావేశంలో చెప్పుకొచ్చారు. వెంటనే ఈ వసూళ్లు నిలిపివేయాలని ఎమ్మెల్యే రవీంద్ర నాధరెడ్డి డిమాండ్ చేసారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయాలు లబ్దిదారుల ఖాతాల్లో వేస్తున్నా..చెత్త పన్ను వసూళ్లతో ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చిందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
ప్రజల్లో ఆగ్రహం.. ప్రభుత్వంపై వ్యతిరేకత
ఎవరో ఎవరితోనో అగ్రిమెంట్ చేసుకుంటే దాన్ని అమలు చేయాల్సిన అవసరం నగరపాలక సంస్థకు లేదన్నారు. క్లాప్ తో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని చెప్పారు. వెంటనే చెత్త పన్ను వసూళ్లు నిలిపివేయాల్సిందేనని ఎమ్మెల్యే సూచించారు. ఈ పథకం పైన మంత్రి..అధికారులతో కలిసి చర్చిస్తామని చెబుతూ, అప్పటి వరకు పన్ను వసూళ్లు నిలిపివేయాలని కోరారు. క్లాప్ పథకం పైన మంత్రి అంజాద్ బాషా స్పందించారు. ఫించన్ల నుంచి చెత్తపన్ను వసూలు చేస్తున్నారని తెలిసి అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. క్లాప్ పథకం పనులకు సంబంధించిన ఒప్పందం ఏంటో తెలియకుండా ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.
ఒప్పందం ఎవరితో..వసూళ్లు ఎక్కడ
స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ తో పాటుగా కడప నగరపాలక సంస్థతో ఒప్పందం చేసుకుందా అని ప్రశ్నించారు. గడప గడపకు ప్రభుత్వం పేరుతో వైసీపీ ప్రజా ప్రతినిధులు ప్రజల ముందుకు వెళ్తున్న సమయంలో..చెత్త పన్ను అంశం సమస్యగా మారింది. పలువురు ప్రజా ప్రతినిధులను సామాన్యులు సైతం దీని పైన ప్రశ్నించారు. ఇక, ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ..దీనిని కొనసాగిస్తే ప్రజాగ్రహం తప్పదని వైసీపీ నేతలే చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు వైసీపీ నేతలే దీని పైన డిమాండ్ చేస్తుండటంతో.. ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.