కాంగ్రెసులో విలీనానికి సరేనన్న కెసిఆర్: కొత్త సిఎం?
న్యూఢిల్లీ: కాంగ్రెసులో తన పార్టీని విలీనం చేయడానికి అభ్యంతరం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పినట్లు సమాచారం. ఇంతకు ముందు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి కెసిఆర్ సోమవారంనాడు ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. తెరాసను కాంగ్రెసులో విలీనం చేయాలని రాహుల్ గాంధీ అడిగినట్లు అందుకు అభ్యంతరం లేదని కెసిఆర్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
కెసిఆర్ సోమవారం తీరిక లేకుండా గడిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు పార్టీ నేతలతో కలిసి ఆయన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ను కలిశారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై కెసిఆర్ రాహుల్ గాంధీతోనూ దిగ్విజయ్ సింగ్తోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది.

కాగా, పార్టీ విలీనం గురించి రెండు రోజుల్లో కెసిఆర్ ఓ ప్రకటన చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కెసిఆర్ విలీనంపై ప్రకటన చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
కాగా, కాంగ్రెసు నాయకులు కూడా ఢిల్లీలో భేటీలతో చురుగ్గా కదిలారు. ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ, రాజ్యసభ సభ్యుడు ఖాన్ సోనియా గాంధీని కలిశారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి జెడి శీలం, కావూరి సాంబశివరావు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు దిగ్విజయ్ సింగ్తో సమావేశమయ్యారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా దిగ్విజయ్ సింగ్ను కలిశారు.
కాగా, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం కన్నా కొత్త ముఖ్యమంత్రిని నియమించే ఆలోచనలోనే కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా, రాష్ట్రపతి పాలనకు సుముఖత వ్యక్తం చేయాలా అనే విషయంపై చర్చలు జరుగుతున్నట్లు దిగ్విజయ్ సింగ్ మీడియాతో చెప్పారు. అయితే, కొత్త ముఖ్యమంత్రి ఏ ప్రాంతం నుంచైనా రావచ్చునని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలా, లేదా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
కాగా, రాష్ట్ర నేతలతో రేపు మంగళవారం దిగ్విజయ్ సింగ్ ఢిల్లీలో సమావేశం కానున్నారు. రాష్ట్ర నేతలను ఢిల్లీ రావాలని పిలిచారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా అనే విషయంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications