గవర్నర్ అధికారాలపై కేసీఆర్ గుర్రు, కామన్ పోలీస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు పార్లమెంటు సభ్యులతో సమావేశమై పలు సూచనలు చేశారు. రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎంపీలతో కేసీఆర్ భేటీ అయ్యారు. పార్లమెంటులో ఏ విధంగా వ్యవహరించాలో చర్చించారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం పార్లమెంటులో పోరాడాలని ఆయన వారికి సూచించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి వీలైనంత ఎక్కువగా లబ్ధి కలిగేలా ప్రయత్నించాలన్నారు.
అలాగే గవర్నర్కు ప్రత్యేక అధికారాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుండి డ్రాఫ్ట్ లేఖ వచ్చింది. దీనిపై కేసీఆర్ ఎంపీల ఎదుట స్పందించారు. డ్రాఫ్ట్ లేఖలో కొన్ని అనవసరమైన అంశాలు చేర్చారని ఆయన అభ్యంతరం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పోస్టింగులు గవర్నర్కు ఇచ్చేందుకు డ్రాఫ్ట్ల్లో ఉంది. దీనిని కేసీఆర్ తప్పు పట్టారు. ప్రత్యేక అధికారాల విషయంలో రాజీ పడవద్దని, పార్లమెంటులో వ్యతిరేకించాలని ఎంపీలకు సూచించారు. అలాగే పోలవరం ఆర్డినెన్స్ను కూడా వ్యతిరేకించాలని సూచించారు.

గవర్నర్ చేతిలో...
సమాచారం మేరకు కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి పంపిన గవర్నర్ ప్రత్యేక అధికారాల డ్రాఫ్ట్లో.. హైదరాబాదులో కామన్ పోలీస్ బోర్డు ఏర్పాటు చేస్తారు. ఈ కామన్ పోలీస్ బోర్డ్ గవర్నర్ చేతిలో ఉంటుంది. బోర్డులో ఏపీ, తెలంగాణ డీసీపీ, ఏసీపీలు ఉంటారు. అధికారుల బదలీ గవర్నర్ చేతిలో ఉంటుంది. విభజన చట్టంలోని ఆర్టికల్ 8 ప్రకారం ఈ నిర్ణయాలు తీసుకున్నామని కేంద్రం టి ప్రభుత్వానికి తెలిపింది. అభిప్రాయం చెప్పవలసిందిగా సూచించింది. చట్టంలోని అంశాలతో పాటు మరికొన్ని బాధ్యతలు అప్పగించాలని కేంద్రం భావిస్తోంది. అయితే, దీనిని వ్యతిరేకించాలని కేసీఆర్ ఎంపీలకు సూచించారు.
వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులతో భేటీ అయిన కేసీఆర్.. కష్టపడి సాధించుకున్న తెలంగాణ సార్థకం కావాలంటే సర్పంచ్ నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. కొత్తగా ఎన్నికైన వరంగల్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో పాటు, జెడ్పీ చైర్మన్ ఆదివారం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ను కలిశారు.
కేసీఆర్తో భేటీ అనంతరం వారు మాట్లాడుతూ... ప్రజలు ఇచ్చిన తెలంగాణ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టినట్లు కేసీఆర్ తమకు చెప్పారని వారు అన్నారు. క్షేత్రస్థాయి నుండి పూర్తి సహకారం అందించాలని కోరినట్లు వారు తెలిపారు.
గుంటూరు కేంద్రంగా కొత్త రైల్వే జోన్ కోసం కృషి
గుంటూరు కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు శాయశక్తులా కృషి చేస్తానని గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ వేరుగా అన్నారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. అనంతరం గుంటూరు రైల్వే స్టేషన్ లో సౌకర్యాలను పర్యవేక్షించారు. డివిజన్ పరిధిలోని సమస్యలను డీఆర్ఎం ప్రసాద్ తో చర్చించారు. ప్రయాణీకులకు అందుబాటులోని సౌకర్యాలను ప్రత్యక్షంగా వీక్షించారు.












Click it and Unblock the Notifications