ఉద్యోగులపై వ్యాఖ్యలు: కెసిఆర్పై ముప్పేట దాడి
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులే పనిచేయాలని, సీమాంద్ర ఉద్యోగులను పనిచేయనీయబోమని, అటువంటివారిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని చేసిన వ్యాఖ్యలకు గాను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ముప్పేట దాడి ప్రారంభమైంది. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పంపకం విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో కెసిఆర్ ఆ వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణలో ఉండిపోవాలని చూస్తున్నారంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు కెసిఆర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
కెసిఆర్ వ్యాఖ్యలపై ఎపి ఎన్జివోల సంఘం నాయకులు వెంటనే మండిపడ్డారు. ఆ తర్వాత మెల్లగా సీమాంధ్ర (ఆంధ్రప్రదేశ్) రాష్ట్రానికి చెందిన నాయకులు ఆయనపై విమర్శనాస్త్రాలు సంధించడం ప్రారంభించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీనికి తెర తీశారు. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా రెచ్చగొట్టడం సరి కాదని, ఆ పరిస్థితి వస్తే తాము సహించబోమని వైయస్ జగన్ అన్నారు. ఉద్యోగులకు కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇవ్వాలని ఆయన కోరారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారంనాడు కెసిఆర్పై విరుచుకపడ్డారు. రెచ్చగొట్టడం కాదు, అబివృద్ధి విషయంలో పోటీ పడాలని ఆయన కెసిఆర్కు సూచించారు. తెలంగాణ భవన్లో వార్ రూమ్ ఎందుకు పెట్టారు, ఎవరి మీద యుద్ధం చేస్తారు అంటూ ఆయన ప్రశ్నించారు. అవసరమైతే తాను వార్ రూమ్కు వస్తానని చెప్పారు.
కొంత మంది సీమాంధ్ర ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో ఉండిపోదామని ప్రయత్నిస్తున్నారనే నేపథ్యంలో అందుకు సంబంధించిన వివరాలను సేకరించడానికి తెరాస కార్యాలయం తెలంగాణ భవన్లో వార్ రూమ్ను ప్రారంభించారు. నకిలీ సర్టిఫికెట్లతో తెలంగాణలో ఉండిపోదామని సీమాంధ్ర ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు దేవీప్రసాద్ వంటివారు విమర్శలు చేస్తున్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి కూడా కెసిఆర్పై విరుచుకుపడ్డారు. కెసిఆర్ రెచ్చగొట్టే పద్ధతి మంచిది కాదని ఆయన అన్నారు. కెసిఆర్ ప్రకటనలతో ఇరు రాష్ట్రాల ప్రజలకు నష్టం, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినవారు అవుతారని ఆయన అన్నారు. మొత్తం మీద, రాష్ట్ర విభజన తర్వాత కూడా పంచాయతీ ముగిసినట్లు కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications