అత్తా! నాన్న బాధపడ్డారు: నన్నపనేనితో కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు అసెంబ్లీ లాబీల్లో గురువారం సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారిని అత్తా అంటూ పరామర్శించారు. మూడు రోజుల క్రితం టిడిపి, టిఆర్ఎస్ ఎమ్మెల్సీల తోపులాటలో నన్నపనేని కిందపడిన విషయం తెలిసిందే. దీనిపై కెటిఆర్ ఆమెతో మాట్లాడారు.
అత్తా బాగున్నావా? అని ఎదురుపడిన నన్నపనేనిని కెటిఆర్ పరామర్శించారు. దానికి నన్నపనేని బాగున్నానయ్యా అంటూ బదులిచ్చారు. రెండు రోజుల క్రితం మండలి మీడియా పాయింటు దగ్గర మీరు కిందపడిపోయిన దృశ్యాన్ని టివిలో చూసి నాన్న(కెసిఆర్) చాలా బాధపడ్డారని చెప్పారు.

టిడిపి ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి, తమ పార్టీకి చెందిన స్వామి గౌడ్ల తోపులాటలో మీరు కిందపడిపోయారని, స్వామి గౌడ్ మిమ్మల్ని తోయలేదని, ఆయన తప్పేం లేదని చెప్పారు. దానికి నన్నపనేని స్వామి గౌడ్ కూడా ఒకటి రెండుసార్లు నెట్టినట్లు టీవీల్లో కనిపించిందని, అయినా క్షమాపణ చెప్పారని, ఇంకేముంది నాయనా అని సమాధానమిచ్చారు.
కాగా, అంతకుముందు కెటిఆర్ మాట్లాడుతూ.. శాసనసభ సజావుగా జరిగేలా సీమాంధ్ర నేతలు సహకరించాలని కోరారు. ఉదయం సభ వాయిదా అనంతరం తెరాస, బిజెపి ఎమ్మెల్యేలు స్పీకర్తో భేటీ అయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ బిల్లుపై చర్చ జరగకుండా బిల్లు రాష్ట్రపతికి వెళ్తే నష్టపోయేది సీమాంధ్రులే అని ఆయన అన్నారు. అవసరమైతే శని, ఆదివారల్లో కూడా సభ నిర్వహించాలని సూచించారు.












Click it and Unblock the Notifications