మోడీని మెప్పించిన కేసీఆర్, అప్రమత్తం చేసిన బాబు
హైదరాబాద్/న్యూఢిల్లీ: సమగ్ర సర్వే పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పిన విషయాలు విన్న ప్రధాని నరేంద్ర మోడీ ముగ్దులయ్యారా? అంటే అవుననే అంటున్నారు. కేసీఆర్ రెండు రోజుల పాటు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. శనివారం ఆయన మోడీని కలిశారు. ఈ సమయంలో మోడీ తెలంగాణలో గత నెల 19న చేసిన సమగ్ర సర్వే పైన ప్రశ్నించారు. సర్వే పైన పూర్తిస్థాయి నివేదిక కావాలని కేసీఆర్కు సూచించారు.
సమగ్ర సర్వే ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని కేసీఆర్ ప్రధానికి వివరించారు. కేసీఆర్ వివరణతో మోడీ ముగ్దులయ్యారని సమాచారం. సర్వే వివరాలను, ఈ సర్వే ద్వారా వచ్చే లాభాలకు సంబంధించిన పూర్తి నివేదికను ఇవ్వాలని మోడీ సూచించారు. అదే సమయంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని మోడీని కోరారు. పన్నుల రాయితీని ప్రకటించాలని, చేవెళ్ల ప్రాజెక్టు బాధ్యతను కేంద్రం తీసుకోవాలని కోరారు.
రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్ ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటితో పాటు పలు కేటాయింపులు జరపాలని కోరారు. కేసీఆర్ శనివారం మోడీతో, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో, కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, రవిశంకర ప్రసాద్ తదితరులతో భేటీ అయ్యారు. మోడీతో భేటీలో తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి 21 అంశాలపై విజ్ఞాపన పత్రం ఇచ్చారు.
ప్రణబ్ ముఖర్జీతో భేటీలో రాష్ట్రంలో ప్రభుత్వం పని తీరు, పథకాల అమలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. పీయూష్ గోషల్ భేటీలో విద్యుత్ సమస్య గురించి, విద్యుత్ కేంద్రం గురించి మాట్లాడారు. రవిశంకర ప్రసాద్తో హైకోర్టు అంశం గురించి చర్చించారు. హైకోర్టు భవన సముదాయంలోనే రెండు రాష్ట్రాల హైకోర్టులను నిర్వహించవచ్చునని, అవసరమైతే స్థలాన్ని ఇస్తామని చెప్పారు. శనివారం కేసీఆర్ కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, ప్రకాశ్ జవదేకర్ తదితరులను కలిశారు.
వర్షాలతో ఏపీలో వరదలు, బాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వర్షాలతో అతలాకుతలం అవుతోంది. అల్పపీడనం కారణంగా ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. విశాఖను మూడు రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. శ్రీకాకుళంలోను ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఖమ్మం జిల్లా తాలిపేరుకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. 13 గేట్లు ఎత్తేశారు. ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తి 44వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గోదావరి 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద క్రమంగా పెరుగుతోంది. దీంతో మరింత ప్రమాదస్థాయికి పెరిగే అవకాశముంది. కాగా, ఇరు రాష్ట్రాల్లోను మరో 24 గంటల పాటు వర్షాలకు అవకాశముందని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.