కాంగ్రెస్పై ఆకర్ష్: కేసీఆర్తో ఎమ్మెల్యే, ఏంకాదని డీఎస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత, చేవెళ్ల శాసన సభ్యుడు యాదయ్య గురువారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. ఆయనతో పాటు మాజీ మంత్రి, వరంగల్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత రెడ్యా నాయక్, ఆయన కూతురు కవిత కూడా కలిశారు.
వీరిని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి వద్దకు తీసుకు వచ్చారు. తెరాస ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా వీరు కూడా తెరాసలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. వారు తెరాసలో చేరేందుకు అంగీకరించినందునే హరీష్ రావు ముఖ్యమంత్రి వద్దకు తీసుకు వచ్చారంటున్నారు.
నిన్న టీడీపీ.. ఇక కాంగ్రెస్!
నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ పైన ప్రధానంగా దృష్టి సారించిన కేసీఆర్, ఇక కాంగ్రెస్ పార్టీ పైన దృష్టి సారిస్తున్నారా అనే చర్చ సాగుతోంది. టీడీపీ నుండి కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి తదితర ముఖ్యనేతలు తెరాసలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చే ఉద్దేశ్యంలో భాగంగా ఆ పార్టీ వైపు కేసీఆర్ దృష్టి సారిస్తున్నారనే చర్చ సాగుతోంది.
నష్టం లేదు: డీ శ్రీనివాస్
ఒకరిద్దరు నేతలు పార్టీ నుండి వెళ్లిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని మాజీ పీసీసీ అధ్యక్షులు, తెలంగాణ శాసన మండలి కాంగ్రెస్ పక్ష నేత డీ శ్రీనివాస్ అన్నారు. ఆయన గురువారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో శ్రీవారిని దర్సించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు కలిసిమెలిసి జీవించాలన్నారు. ప్రేమాభిమానాలతో ఉండాలని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పర సహకారం, అవగాహనతో ముందుకు వెళ్లాలన్నారు. ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేయాలన్నారు. పార్టీ నుండి కొందరు వెళ్లినంత మాత్రాన ఏమీ కాదన్నారు.