ఓ మంత్రి తెలిసో తెలియకో..: రుణమాఫీపై తగ్గిన కెసిఆర్!
న్యూఢిల్లీ: రుణమాఫీ పైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తగ్గారా? లేక వ్యూహాత్మకంగా పెదవి విప్పకుండా ఊరుకున్నారా? అనే చర్చ సాగుతోంది. ఆదివారం ఆయన న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు సమస్యల పైన తమకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. దానికి తామ వంద శాతం కట్టుబడి ఉన్నామని చెప్పారు.
రైతులు ఎలాంటి భయాందోళనలకు లోనుకావొద్దన్నారు. కెసిఆర్ గురించి తెలంగాణ ప్రజలకు తెలుసునని, అవసరమైతే మాఫీ మొత్తం ఎక్కువైనా ఇచ్చిన మాట మీద నిలబడతామని చెప్పారు. ఒక మంత్రి తెలిసీ తెలియక ఏదో మాట్లాడితే.. దానిని పట్టుకొని విపక్షాలు నానాయాగీ చేస్తున్నాయన్నారు.

తొందరపడి ఏదీ మాట్లాడవద్దని తాను మంత్రులకు చెప్పానని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చి వారం రోజులు మాత్రమే అవుతుందని, అప్పుడే నాలుగు రోజులుగా తమ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తుండటం విడ్డూరమన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, మరో ఏడెనిమిది రోజుల్లో రుణమాఫీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నాలుగురోజుల ప్రభుత్వాన్ని పట్టుకొని నానాయాగీ చేస్తున్నారన్నారు. తాను బ్యాంకర్లను లెక్కలు మాత్రమే అడిగానని తెలిపారు.
తనను లక్ష్యంగా చేసుకోవడానికి గోటికాడి నక్కల్లా కాచుకొని కూర్చున్నారని చెప్పేందుకు ఇది నిదర్శనమన్నారు. తాను ఈ నాలుగు రోజులు వ్యూహాత్మకంగా ఊరుకున్నానని, విపక్షాల తీరును చెప్పేందుకే మాట్లాడలేదన్నారు. చెప్పిన రుణాలను తప్పకుండ మాఫీ చేసి తీరుతామన్నారు. అధికారుల కొరత వల్లే బ్యాంకర్ల నివేదిక ఆలస్యమైందన్నారు.
వెనక్కి తగ్గారా?
రుణమాఫీ పైన నాలుగు రోజులుగా రైతులు రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేస్తుండటం, విపక్షాలు విరుచుకు పడటంతో కెసిఆర్ తగ్గారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రుణమాఫీపై తెరాస ప్రభుత్వం పరిమితులు విధించిన నేపథ్యంలో పలువురు రైతులు చనిపోయారు. విపక్షాలు దీనిపై ఉద్యమానికి సిద్ధమని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చీ రాగానే సమస్యలు కొని తెచ్చుకోవద్దనే ఉద్దేశ్యంతోనే కెసిఆర్ పునరాలోచన చేసి... వెనక్కి తగ్గారని అంటున్నారు. అయితే దానినే వ్యూహాత్మక మౌనంగా చెబుతున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications