విభజన చట్టం: రాజ్కు కేసీఆర్ ఫిర్యాదు, హైద్రాబాద్పై..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన విభజన చట్టం అంశంపై హోంమంత్రికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. విభజన చట్టంలోని పలు అంశాల పైన రాజ్నాథ్తో కేసీఆర్ చర్చించారు.
హైదరాబాదుపై గవర్నర్ అధికారాలు వద్దంటూ రాజ్నాథ్ సింగ్ను కోరారు. దీంతో పాటు ఉద్యోగుల విభజన, తెలంగాణకు కేంద్రం సహాయ సహకారాల గురించి చర్చించారు. విభజన చట్టం ప్రకారం ముందుకు వెళ్లడం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. భేటీ అనంతరం కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు వినోద్ మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని పలు అంశాల పైన స్పష్టత ఇవ్వాలని తాము హోంమంత్రిని కోరామని తెలిపారు. తాము కొత్తగా ఏమీ అడగడం లేదన్నారు. కాగా, కేసీఆర్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్రమంత్రులను కలిసిన విషయం తెలిసిందే.