వనజాక్షి ఇష్యూపై కెఈ విచిత్ర వ్యాఖ్య, అక్టోబర్ 22లోగా ప్రత్యేకహోదా!
అమరావతి: ముసునూరు తహసీల్దారు వనజాక్షి విషయమై ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెదిరింపు లేఖ వస్తే వనజాక్షి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు.
తనకు అందిన బెదిరింపు లేఖను విచారణాధికారికి అందజేయాలని ఆయన వనజాక్షికి సూచించారు. బెదిరింపు లేఖ నేపథ్యంలో వనజాక్షికి భద్రత కల్పించాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.
రిషికేశ్వరి ఘటన పైన మాట్లాడుతూ... వైసిపి ఉద్దేశ్యపూర్వకంగా రిషికేశ్వరి ఘటనను రాజకీయం చేస్తోందన్నారు. అగ్రిగోల్డ్ విషయమై మాట్లాడుతూ.. విచారణ కమిటీని నియమిస్తామని చెప్పారు. కమిటీ నివేదిక తర్వాత ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు.
ఏపీకి అక్టోబర్ 22వ తేదీలోగా ప్రత్యేక హోదా వస్తుందని భావిస్తున్నామని కెఈ కృష్ణమూర్తి చెప్పారు. ఆయన గురువారం నాడు ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఎబిఎన్తో మాట్లాడి ఈ వివరాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక హోదాపై బిజెపి పిల్లిమొగ్గలు సరికాదన్నారు.
ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అంగన్వాడీలకు జీతాలు పెంచాం: సుజాత
రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పీతల సుజాత గురువారం చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తల జీతాల అంశంపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన గురువారం సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘంలో ఆమె పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీ సమస్యలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 1,04,377 మంది అంగన్వాడీ సిబ్బంది ఉన్నారని, వారందరికీ జీతాల పెంపు వర్తిస్తుందని తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.317 కోట్ల భారం పడుతుందన్నారు.