20 గంటల యాత్ర: ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం
హైదరాబాద్: ప్రఖ్యాత ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మంగళవారంనాడు ప్రశాంతంగా ముగిసింది. 20 గంటల సుదీర్ఘ శోభాయాత్ర తర్వాత వినాయకుడు గంగను చేరాడు. భారీ క్రేన్ల సాయంతో అధికారులు విజయవంతంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. మహాగణపతి నిమజ్జనోత్సవాన్ని దర్శించడానికి పెద్ద యెత్తున ప్రజలు కదిలి వచ్చారు.
హైదరాబాదులోని హుస్సేన్ సాగర్లో మహాగణపతి నిమజ్జనాన్ని సందర్శించడానికి పెద్ద యెత్తున ప్రజలు రావడంతో నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ కిటకిటలాడాయి. మంగళవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో మహా గణపతిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు.

మహా గణపతి నిమజ్జనం స్థలానికి చేరుకోగానే ఉత్సవ కమిటీ తుది పూజలు చేసింది. భారీ క్రేన్ల సాయంతో గణపతి జలప్రవేశం చేశాడు. హైదరాబాదులో వినాయక విగ్రహాల నిమజ్జనం రెండు రోజుల పాటు భారీగా నడిచింది.
ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర కన్నులపండుగ సాగింది. ఖైరతాబాద్ నుంచి సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రారంభమైన మహా గణపతి శోభాయాత్ర తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా మంగళవారం మధ్యాహ్నానికి సచివాలయం చేరుకుంది.

వినాయక నిమజ్జనం శాంతియుతంగా ముగిసిందని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ అన్నారు. నిమజ్జనాన్ని విజయవంతం చేసిన పోలీసులకు ఆయన అభినందనలు తెలిపారు. నిమజ్జన కార్యక్రమంలో 50 వేల మంది పోలీసులు విధులు నిర్వహించారని ఆయన చెప్పారు. సిసి కెమెరాల కింద నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిసినట్లు అనురాగ్ శర్మ చెప్పారు.












Click it and Unblock the Notifications