ఎంపీలపై వేటు, సభలో బిల్లు: కిరణ్ ఆగ్రహం, రేపే రిజైన్?
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటులో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెడితే శాసనసభ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ముగియగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం తనను కలిసేందుకు వచ్చిన సీమాంధ్ర ప్రాంత సీనియర్ మంత్రులు, సహచర ఎమ్మెల్యేలకు ఆయన ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలిసింది. ఇదే సమయంలో ఆరుగురు ఎంపీల బహిష్కరణ అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చింది.
బిల్లు పార్లమెంటుకు ఎప్పుడు తీసుకు వస్తే అప్పుడు రాజీనామా చేస్తానని ఆయన సన్నిహితులతో వ్యాఖ్యానించారని తెలుస్తోంది. సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ వేటుపై స్పందించిన సిఎం ఎంపీలకు నైతిక మద్దతును ప్రకటిస్తూ సంఘీభావంగా మాట్లాడాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సూచించారు. మంత్రులు రఘువీరా రెడ్డి, గంటా శ్రీనివాస రావు, కొండ్రు మురళీ, పితాని సత్యనారాయణ, అహ్మదుల్లా, మహీధర్ రెడ్డి, కాసు వెంకట కృష్ణారెడ్డితో పాటు, దాదాపు 25 మంది శాసనసభ్యులు మంగళవారం కిరణ్తో భేటీ అయ్యారు.
ఈ భేటీలో రాజీనామా అంశం ప్రత్యేకంగా ప్రస్తావనకు రానప్పటీకీ సిఎం వారికి ఆ మేరకు సంకేతాలు మాత్రం ఇచ్చారు. ముందస్తుగా తీసుకున్న నిర్ణయం మేరకు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెడితే, శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు రాజీనామా పత్రాన్ని అందజేయాలని కిరణ్ భావిస్తున్నారు. కిరణ్కు సంఘీభావంగా కొందరు సీమాంధ్ర ఎమ్మెల్యేలూ అదే రోజున తమ రాజీనామా పత్రాలను స్పీకర్కు అందజేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇటీవల బిఎసి సమావేశంలోనే కిరణ్ రాజీనామా అంశం చర్చకు వచ్చిందట. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కేటాయింపు అంశాన్ని శోభా నాగి రెడ్డి ప్రస్తావించినప్పుడు.. ఇంకా అభివృద్ధి నిధులతో పనేముందని, 13న సిఎం తన పదవికి రాజీనామా చేస్తుంటే రాష్ట్రప్రభుత్వం ఏమవుతుందోనని రఘువీరా అన్నారట. మంగళవారం తనతో సమావేశమైన మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డితో సైతం బిల్లును గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు సిఎం పేర్కొన్నారు.