స్పష్టత లేదు: విభజనపై మండలిలో గొంతువిప్పిన కిరణ్
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభలో మొదటిసారి గొంతు విప్పారు. శాసన మండలిలో ఆయన గురువారం మధ్యాహ్నం మాట్లాడారు. విభజన అంశం చాలా కీలకమైనదని, సున్నితమైనదని పేర్కొన్నారు. దీనిపై చర్చను నిబంధనల ప్రకారం, సంప్రదాయానికి లోబడి జరపాలన్నారు.
ఇతర రాష్ట్రాల్లో విభజన సమయంలో ఎలా జరిగిందో దానిని చూసి చర్చను కొనసాగించాలన్నారు. ఉద్వేగాలకు తావులేకుండా చర్చ జరగాలని ఆకాంక్షించారు. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. చర్చ ద్వారా సభ్యులకు స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు.
ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటును కిరణ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అవసరమైతే ఇంకో బిఏసిని పట్టాలన్నారు. మాట్లాడేటప్పుడు పద ప్రయోగం జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలన్నారు. చర్చ పైన ఇప్పటి వరకు స్పష్టత రాలేదన్నారు. చర్చ విధానం పైన స్పష్టత ఇవ్వాలన్నారు.
యనమల అభ్యంతరం
కిరణ్ మాట్లాడుతుండగా మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అభ్యంతరం తెలిపారు. చర్చ ఎప్పుడు, ఎలా జరుగుతుందన్న దానిపై స్పష్టత కావాలన్నారు. కిరణ్ అప్పీల్లో ఎలాంటి స్పష్టత లేదన్నారు. బిల్లుకు సంబంధించి తెలుగు కాపీలు సరిగా లేవన్నారు.
పోడియం చుట్టుముట్టిన సభ్యులు
తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ప్రసంగిస్తూ బీహార్ విభజన అంశాన్ని ప్రస్తావించారు. ఈ దశలో సీమాంధ్ర ఎమ్మెల్సీలు జై సమైక్యాంధ్ర అని నినాదాలు చేస్తూ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో చైర్మన్ మండలిని గంటపాటు వాయిదా వేశారు.