వెనక్కి వెళ్లలేమని డిగ్గీ బుజ్జగింపు, తగ్గనని కిరణ్: టెన్షన్
హైదరాబాద్: రాష్ట్రానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణపై బుజ్జగించే ప్రయత్నాలు చేశారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. గురువారం ఉదయం డిగ్గీ హైదరాబాదుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన వరుసగా నేతలతో భేటీ అవుతూ బిజీబిజీగా గడుపుతున్నారు.
ముఖ్యమంత్రి లేక్ వ్యూ అతిథి గృహంలో డిగ్గీతో మధ్యాహ్నం రెండున్నర గంటలకు భేటీ అయ్యారు. అరగంటకు పైగా వారి కొనసాగింది. ఇరువురు విభజన అంశం పైనే చర్చించారు. విభజనకు అనుకూలంగా సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్నప్పటి నుండి కిరణ్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
దీంతో దిగ్విజయ్ ముఖ్యమంత్రిని బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే కిరణ్ మాత్రం విభజనకు ససేమీరా అంటున్నారంటున్నారు. విభజన ద్వారా కలిగే నష్టాలను కిరణ్ వివరించగా.. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని డిగ్గీ చెప్పినట్లుగా సమాచారం.
విభజనపై అధిష్టానంకు సహకరించాలని డిగ్గీ కోరగా.. కిరణ్ ససేమీరా అన్నారట. సమైక్యంపై తమ నిర్ణయంలో మార్పు ఉండదని, మీరే పునరాలోచించుకోవాలని కిరణ్ చెప్పగా.. డిగ్గీ కూడా ఈ సమయంలో టిపై వెనక్కి వెళ్లలేమని, పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని సూచించారు.
డిగ్గీ బిజీబిజీ
రాష్ట్రానికి వచ్చిన డిగ్గీ బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన ఉదయం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను పరామర్శించారు. అనంతరం లేక్ వ్యూ గెస్టు హౌస్లో పలువురు నేతలను కలిశారు. ఆ తర్వాత కిరణ్తో భేటీ అయ్యారు. సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. ఆరు గంటల తర్వాత పిసిసి కార్యవర్గంతో భేటీ అవుతారు.
లేక్వ్యూ వద్ద ఉద్రిక్తత
లేక్ వ్యూ అతిథి గృహం వద్ద సీమాంధ్ర విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తంగా మారింది. దిగ్విజయ్ గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. లోపలకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ వారు రోడ్డు పైన బైఠాయించారు.