గాంధీభవన్కు సిఎం కిరణ్ రెడ్డి డుమ్మా: విహెచ్ ఫైర్
హైదరాబాద్: పార్టీ కార్యాలయం గాంధీభవన్లో శనివారం జరిగిన కాంగ్రెసు పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాజరు కాలేదు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ పతాకను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ అబిప్రాయులు చెప్పుకుని సమష్టి నిర్ణయానికి కట్టుబడి ఉండడం కాంగ్రెసు విధానమని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ అన్నారు. ఓటమికి కాంగ్రెసు కుంగిపోదని ఆయన అన్నారు. విజయానికి పార్టీ పొంగిపోదని ఆయన అన్నారు.
కార్యక్రమంలో మంత్రులు కె. జానారెడ్డి, దానం నాగేందర్, పొన్నాల లక్ష్మయ్య, కాసు కృష్ణారెడ్డి, పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి కిరణ్ కుమార్ రెడ్డి హాజరు కాకపోవడంపై వి. హనుమంతరావు తీవ్రంగా మండిపడ్డారు. కార్యక్రమానికి ఎందుకు రాలేదో కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కార్యక్రమానికి రాకుండా ముఖ్యమంత్రి కార్యకర్తలకు ఏం సందేశం ఇస్తున్నారని ఆయన అడిగారు. కాంగ్రెసు సంస్కృతిలో ముఖ్యమంత్రి ఇమిడిపోవాలని ఆయన అన్నారు. కాంగ్రెసు దయాదాక్షిణ్యాల మీదనే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అన్నారు. అవినీతి విషయంలో రాహుల్ గాంధీ సూచలను ముఖ్యమంత్రి పాటించాలని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారని, అలా చేసి తర్వాత కాంగ్రెసును ఇబ్బందులు పెట్టవద్దని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి రాలేదు, మాకేం చెబుతారని కాంగ్రెసు కార్యకర్తలు అంటే సమాధానం ఏం చెప్పాలని ఆయన అడిగారు.
కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాసిన ప్రపంచదేశాలు - పాలనా వ్యవస్థలు అనే పుస్తకం ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు సతీమణి, కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా పాల్గొన్నారు. జస్టిస్ చలమేశ్వర్తో పాటు రాఘవులు (సిపిఎం), ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (వైయస్సార్ కాంగ్రెసు), కెటి రామారావు (టిఆర్ఎస్), తుమ్మల నాగేశ్వర రావు (తెలుగుదేశం) తదితరులు పాల్గొన్నారు.