ఈటెల వ్యాఖ్య: కిరణ్ రెడ్డి కౌంటర్, బాబు వివరణ
హైదరాబాద్: యాభై ఆరేళ్ల సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వ్యక్తికి అడ్వొకేట్ జనరల్ పదవి ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిస్పందించారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ సందర్భంగా ఇది జరిగింది. తెలంగాణ నేతలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడ్వొకేట్ జనరల్ పదవి తెలంగాణవాళ్లకు ఎందుకివ్వలేదని కిరణ్ కుమార్ రెడ్డి అడిగారు. సుదర్శన్ రెడ్డి తన క్లాస్మేట్ కారని ఆయన అన్నారు.
తెలంగాణ నేతలు ముఖ్యమంత్రులుగా ఉన్నది కేవలం ఆరేళ్ల మూడు నెలలు మాత్రమేనని చెబుతూ ఈటెల రాజేందర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. నీలం సంజీవరెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా ఉన్నది సీమాంధ్ర నేతలేనని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని - పివి నర్సింహారావును కాంగ్రెసు అడుగడుగునా అవమానించిందని ఆయన అన్నారు. ఎఐసిసి అధ్యక్షుడిగా, ప్రధాన మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన పివి నర్సింహారావు మరణిస్తే ఢిల్లీలో అంత్యక్రియలు జరపలేదని ఆయన అన్నారు.
పివి నర్సింహారావు అంత్యక్రియలను హైదరాబాదులో కూడా సరిగా చేయలేదని ఆయన అన్నారు. దాన్ని నిరసించింది, ఖండించింది తమ పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు. తెలుగువారి గురించి మాట్లాడింది తామేనని ఆయన అన్నారు. తెలుగువారికి అవమానం జరిగితే తామే నిరసించామని ఆయన చెప్పారు. పివి నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు నంద్యాల నుంచి పోటీ చేస్తే తెలుగువారనే గౌరవంతో తాము పోటీ కూడా పెట్టలేదని ఆయన గుర్తు చేశారు.
పివిని మీరు (తెలంగాణవాళ్లు) గెలిపిస్తారనే తాము (రాయలసీమవాళ్లు) గెలిపించామని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. దోపిడి పార్టీ, దొంగల పార్టీ మీదో మాదో ప్రజలు తేలుస్తారని ఈటెల రాజేందర్ తెలుగుదేశం సభ్యుల అభ్యంతరాలకు సమాధానం ఇస్తూ అన్నారు. పదే పదే అబద్ధాలను ప్రచారం చేస్తే నిజాలు కావని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications