కిరణ్పై డిఎస్: హైదరాబాద్లో డిగ్గీకి సమైక్య సెగ, భద్రత
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బిల్లు విషయంలో సహకరిస్తారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు డి శ్రీనివాస్ గురువారం అన్నారు. సీమాంధ్ర ప్రాంత నేతగా కిరణ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తారని, సమైక్యమే అంటారన్నారు. అయితే, విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చాక అధిష్టానం ప్రతినిధిగా పార్టీ నిర్ణయానికి ఆయన మద్దతు పలుకుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమరుల కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలి: ఎర్రబెల్లి
పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని టిటిడిపి నేత ఎర్రబల్లి దయాకర రావు డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మబలిదానాలతోనే రాష్ట్రం సాధ్యమవుతోందన్నారు. అమరవీరుల కుటుంబాలకు టిడిపి అండగా ఉంటుందన్నారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలన్నారు.
హైదరాబాదుకు దిగ్విజయ్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ గురువారం మధ్యాహ్నం హైదరాబాదుకు వచ్చారు. ఆయన విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తదితరులు వచ్చారు.
ఎపిఎన్జీవో హెచ్చరికతో భారీ బందోబస్తు
రాష్ట్రానికి దిగ్విజయ్ సింగ్ వస్తే తాము గో బ్యాక్ అంటూ అడ్డుకుంటామని ఎపిఎన్జీవోలు హెచ్చరించడంతో శంషాబాద్ విమానాశ్రయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
దిగ్విజయ్కు సమైక్య సెగ
డిగ్గీ రాకతో విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన రాకను నిరసిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నేతలు ఆందోళనకు దిగారు. డిగ్గీ వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో తెలంగాణవాదులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సమైక్యవాదులను అదుపులోకి తీసుకున్నారు.