బాబుతో కూర్చునేందుకు కిషన్ నో! అందుకేనని వివరణ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి తెలంగాణ బిజెపి అధ్యక్షులు, అంబరుపేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి డుమ్మా కొట్టారు.
చంద్రబాబుతో జరిగిన విలేకరుల సమావేశానికి తాను రానని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్కు కిషన్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. తాను రానని, చంద్రబాబుతో కలిసి మీరు ప్రెస్ మీట్ పెట్టుకోవాలని సూచించారట. బాబుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జవదేకర్, బండారు దత్తాత్రేయ, నరేష్ గుజ్రాల్, గోయల్ తదితరులు ఉన్నారు.
మరోవైపు సీమాంధ్ర బిజెపి అధ్యక్షులు కంభంపాటి హరిబాబు కూడా రాలేదు. అయితే, కంభంపాటి హరిబాబు, కిషన్ రెడ్డిల గైర్హాజరీ పైన విలేకరులు ప్రశ్నిస్తే... పొత్తులకు రాష్ట్ర బిజెపి క్యాడర్ కూడా అంగీకరించిందని ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. ఎవరికీ అభ్యంతరం లేదన్నారు.
కాగా, తెలుగుదేశం పార్టీతో పొత్తును తెలంగాణ ప్రాంత బిజెపి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. శనివారం బిజెపి జిల్లాల అధ్యక్షులు మూకుమ్మడి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. పొత్తులో భాగంగా తమ స్థానాలు టిడిపికి కేటాయించవలసి వస్తుందని బిజెపి జిల్లా అధ్యక్షులు రాజీనామా చేసేందుకు సిద్దపడ్డారంటున్నారు. బిజెపి, టిడిపిల పొత్తుపై ఇరు ప్రాంతాల్లో.. ఇరు పార్టీల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
కార్యకర్తలను ఒప్పించే ప్రయత్నం: కిషన్ రెడ్డి
పొత్తుపై అసంతృప్తితోనే తాను టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశానికి వెళ్లలేదన్న ప్రచారంపై కిషన్ రెడ్డి స్పందించారు. తాను పొత్తులపై కార్యకర్తలను, నేతలను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నానని, అందుకే టిడిపి కార్యాలయానికి వెళ్లలేదన్నారు. పార్టీ శ్రేణుల్లో ఉన్న అసంతృప్తిని తొలగిస్తామన్నారు. రెండు మూడు రోజుల్లో అన్ని సద్దుమణుగుతాయన్నారు.