ముఖ్యమంత్రి జగన్ చెప్పారంటూ గన్నవరం అభ్యర్థిని ప్రకటించిన కొడాలి నాని
ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల మధ్య కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య వర్గపోరు నడుస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసేది తామంటే తామంటూ ఈ మూడు వర్గాలు హోరాహోరీగా పోరాడుకుంటున్నాయి.

రాబోయే ఎన్నికల్లో పోటీచేసేది తానేనంటున్న యార్లగడ్డ
2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీచేసేది తానేనని యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేస్తున్నారు. తాజాగా గన్నవరం నియోజకవర్గ ప్లీనరీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి కొడాలి నాని రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసేది ఎవరో తేల్చేశారు. నాని వ్యాఖ్యలతో కలకలం రేకెత్తింది. పార్టీ నేతల మధ్య విభేదాలుంటే పిలిచి మాట్లాడతాను.. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీచేస్తారు.. అందరూ కలిసి పనిచేయాలి అని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. కాబట్టి అందరూ కలిసి పనిచేయండంటూ నాని పిలుపునిచ్చారు. దీంతో యార్లగడ్డ, దుట్టా వర్గాల్లో కలకలం రేకెత్తింది.

800 ఓట్ల తేడాతో ఓటమి పాలైన యార్లగడ్డ
నాని చేసిన వ్యాఖ్యల్లో వాస్తవమెంతో తెలియదు. గన్నవరం పంచాయితీపై ఇంతవరకు ముఖ్యమంత్రి స్పందించలేదు. ఆయన మనసులో ఏముందో తెలియదు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన యార్లగడ్డ వెంకట్రావు 800 స్వల్ప ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిన వంశీ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటివరకు నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా కొనసాగుతున్న దుట్టా రామచంద్రరావుకు ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని ప్రచారంలో ఉంది. ఓడిపోయిన తర్వాత యార్లగడ్డకు డీసీసీబీ చైర్మన్ పదవిని ఇచ్చారు.

ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన యార్లగడ్డ, దుట్టా వర్గాలు
పార్టీ కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో మొదటి నుంచి వైసీపీలో ఉన్నవారికి కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తున్నారని, వంశీ వర్గీయులకే పదవులు దక్కుతున్నాయంటూ యార్లగడ్డ, దుట్టా వర్గాలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశాయి. ఈ విషయమై ముఖ్యమంత్రి దగ్గర మూడుసార్లు పంచాయితీ జరిగింది. అయినప్పటికీ మార్పు రాకపోతుండటంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు ఎలా స్పందిస్తారనేదాన్ని బట్టి గన్నవరం భవిష్యత్తు రాజకీయాలు ఉండబోతున్నాయి. అన్నింటికన్నా చిత్రమైన విషయం ఏమిటంటే.. గన్నవరం ప్లీనరీకి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాజరు కాలేదు.












Click it and Unblock the Notifications