పవన్ కళ్యాణ్కు కొడాలి నాని సవాల్: చంద్రబాబు సహా గుంపులుగా వచ్చిన జగన్ సింగిల్గానే
అమరావతి: జనసేన, టీడీపీ పొత్తు అంశంపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై చేస్తున్న కామెంట్లపై అధికార వైసీపీ మంత్రులు, నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని పవన్ కళ్యాణ్, చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు.
చంద్రబాబు కలలు.. పిచ్చి భ్రమలో పవన్ కళ్యాణ్ అంటూ కొడాలి నాని
సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఏపీలో 2024లో అధికారంలోకి వస్తామని చంద్రబాబు కలలు కంటున్నారన్నారు. టీడీపీ ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. అధికారంలోకి రాలేదని అన్నారు. 2014లో సీఎం వైఎస్ జగన్ ను అధికారంలోకి రానివ్వకుండా పార్టీ పెట్టి అభ్యర్థిని కూడా పెట్టకుండా చంద్రబాబును గెలిపించానని పవన్ పిచ్చి భ్రమలో ఉన్నారన్నారు. 2019లో నాలుగు పార్టీలను కలుపుకుని వ్యతిరేక ఓటు చీలకుండా చూశానని అనుకుంటున్నారన్నారు.
సింహం సింగిల్గానే అంటూ కొడాలి నాని
పవన్ కళ్యాణ్ను అడ్డం పెట్టుకుని సీఎం జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా చూడాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. ఉత్తుత్తి పుత్రుడు, దత్త పుత్రుడు.. చంద్రబాబు చెప్పినట్లుగానే వాగుతుంటారన్నారు. రాష్ట్ర ప్రజలు అమాయకులు, కళ్లకు గంతలు కట్టాము.. అనుకుంటే అది మీ భమ్రే అంటూ విమర్శించారు. మీరు కలిసి వచ్చినా.. విడివిడిగా వచ్చినా ఇక్కడ పోయేది ఏమీ లేదు. ఎన్ని గుంపులుగా వచ్చినా చెల్లెచెదురు చెయ్యడానికి సింహం సింగిల్గానే వచ్చేందుకు రెడీగా ఉందని కొడాలి నాని అన్నారు.
పవన్ కళ్యాణ్కు కొడాలి నాని సవాల్
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలో రాజకీయ సమాధి చేస్తామన్నారు కొడాలి నాని. 2024లో వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు చివరి ఎన్నికలన్నారు. పవన్ కళ్యాణ్ ముందు ఎమ్మెల్యేగా గెలవాలని.. ఆ తర్వాతే మాట్లాడాలని కొడాలి నాని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఒకరికి అధికారం, మరొకరికి డబ్బు వస్తుందే కానీ, ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు కొడాలి నాని. పవన్ సహా మరో నాలుగు పార్టీలు కలిసినా ప్రజలు పట్టించుకోరని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ జగన్ ఒంటరిగానే పోటీ చేసి 151 స్థానాల్లో విజయం సాధిస్తారని అన్నారు.