బీజేపీ,టీడీపీపై కొణతాల డైలమా, మంత్రి సునీత ధీమా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఏ పార్టీలో చేరాలనే విషయమై తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఏ పార్టీలో చేరాలనే విషయమై ఆయన స్పందించారు. మరో పార్టీలో చేరేందుకు తొందరేమీ లేదని, అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాక నిర్ణయం ప్రకటిస్తానని ఆయన బుధవారం అన్నారు.
త్వరలోనే అన్ని నియోజకవర్గాల్లోని కార్యకర్తలతో సమావేశమవుతానని, అందరి అభిప్రాయాలు తెలుసుకుని ఆపై నిర్ణయం తీసుకుంటానన్నారు. తొందరపడి ఏదో ఒక నిర్ణయం ప్రకటించాల్సినంత అవసరం ఇప్పుడు లేదన్నారు. టీడీపీలో చేరికపై గండి బాబ్జీతో అభిప్రాయ భేదాలు ఏర్పడినట్టు వచ్చిన వార్తలపై స్పందించారు.

ఏ పార్టీలో చేరాలనే దానిపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండడం సహజమని, అంతమాత్రాన అదే తుది నిర్ణయం అనుకోవడం సరికాదన్నారు. టీడీపీలోనా లేక భారతీయ జనతా పార్టీలోనా అన్నది ఇప్పుడే చెప్పలేనని, ఇప్పుడు ఈ రెండూ మిత్రపక్షాలేనని, అందులో ఏ పార్టీ అయినా ఒక్కటే అన్నారు.
రఘువీరాపై పరిటాల సునీత ఆగ్రహం
తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుందన్న పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పరిటాల సునీత ఘాటుగా స్పందించారు. ఆయన మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. అన్ని విషయాలూ తెలిసి ఆయన ఇలా మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ సంప్రదాయానికి విరుద్దంగా అభ్యర్థిని పోటీలో నిలిపారన్నారు. అయినప్పటికీ టీడీపీ అభ్యర్థి మంచి మెజార్టీతో గెలుస్తారన్నారు.












Click it and Unblock the Notifications