విశాఖ రైల్వే జోన్పై నవ్వాలో ఏడ్వాలో, థ్యాంక్స్ చెప్పా: చంద్రబాబును కలిసిన కొణతాల
అమరావతి: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. అన్ని రంగాల్లో ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని చెప్పారు.
తూర్పు గోదావరి జిల్లాలోని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా విశాఖపట్నంకు నీరు అందిస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపానని అన్నారు. ఉత్తరాంధ్రని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ను ప్రకటించడంపై కొణతాల స్పందించారు. దీనిపై నవ్వాలో ఏడవాలో తెలియడం లేదన్నారు. రేపు విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలన్నారు.
ఆయన అంతకుముందు సీపీఎం కార్యాలయంలోను ఆ పార్టీ నేతలను కలిశారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర అభివృద్ధికి అన్ని పార్టీలు మద్దతు కావాలన్నారు. ఉత్తరాంధ్ర అజెండా 2019 ఎన్నికలు అంశంపై నేతలకు ఆయన వినతి పత్రం ఇచ్చారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఉత్తరాంధ్రపై వైఖరిని చెప్పాలన్నారు.