కోటంరెడ్డి వర్సస్ ఆనం - నెల్లూరు పోరులో కొత్త ట్విస్ట్ ..!?
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఆనం- కోటంరెడ్డి మధ్య కొత్త పోటీ మొదలైంది.
నెల్లూరు లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముందుగా ఆనం..తరువాత కోటంరెడ్డి ఇద్దరూ వైసీపీ ప్రభుత్వం పైన వ్యతిరేక వ్యాఖ్యలు చేసారు. ఇద్దరూ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నా...ఇద్దరి నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జ్ లు వచ్చేసారు. ఇద్దరిలో ఆనం సైలెంట్ గా ఉంటుండగా.. కోటంరెడ్డి తన పైన వ్యాఖ్యలు చేసిన అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఇద్దరూ టీడీపీ వైపే అడుగులు వేస్తన్నారనే ప్రచారం సాగింది. ఈ ఇద్దరి నేతల పైన టీడీపీ నేతల నుంచి మాత్రం ఎటువంటి స్పందన రావటం లేదు. ఇద్దరు పోటీ చేసే సీట్ల పైనా అంచనాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఇద్దరి మధ్య కొత్త పోటీ నెలకొంది. ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఆనం వర్సస్ కోటంరెడ్డిగా మారిన ఆ వ్యవహారం నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.

ఇద్దరు ఎమ్మెల్యేలూ టీడీపీ వైపేనా
ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా సీనియర్ నేత. గతంలో కాంగ్రెస్ ,టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేసారు. 2019 ఎన్నికల్లో వెంకటగిరి నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. కానీ, పార్టీలో ఎక్కవ కాలం ఇమడ లేకపోయారు. తన వ్యాఖ్యలతో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా..పెత్తనం చేయలేని పరిస్థితలో ఉన్నారు. కొత్త ఇంఛార్జ్ తన పని తాను చేసుకుపోతున్నారు. ఇదే తరహాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తన ఫోన్ ట్యాపింగ్ చేసారని..తనను అవమానించారంటూ పార్టీ నాయకత్వం పైన ఫైర్ అయ్యారు. ఆయన స్థానంలోనూ ఎంపీ ఆదాల ఇంఛార్జ్ గా వచ్చేసారు. ఇప్పుడు ఆన్.. కోటంరెడ్డి ఇద్దరికి టీడీపీ నుంచి మద్దతు ఉందని..ఇద్దరు నేతలు టీడీపీలోకే వెళ్తున్నారని జిల్లా రాజకీయాల్లో ప్రచారం సాగుతోంది. దీని పైన కోటంరెడ్డి పరోక్షంగా టీడీపీ గురించి మాట్లాడుతున్నా..ఆనం మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉండటంతో వేచి చూసే ధోరణితో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

ఇద్దరూ టీడీపీలో ఒకే సీటు పై కన్ను..!
ఆనం..కోటంరెడ్డి ఇద్దరూ ఇప్పుడు టీడీపీలోకి వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ నాయకత్వం నుంచి హమీ వచ్చిన తరువాతనే కోటంరెడ్డి వైసీపీ పైన తన వాయిస్ పెంచారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆనం తన నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ముందు నుంచి టీడీపీలోకి వెళ్తారని వైసీపీలోనే ప్రచారం సాగుతోంది. ఆయన కుమార్తె కూడా టీడీపీ నుంచి సీటు ఆశిస్తున్నట్లుగా గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు నెల్లూరు రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరిగి అదే సీటు నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు హామీ పొందారని..అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు ప్రారంభిస్తున్నారని చెబుతున్నారు. కానీ, అనూహ్యంగా ఆనం కూడా ఇదే సీటు ను టీడీపీ నుంచి కోరుకుంటున్నట్లుగా సమాచారం. ఆనం నెల్లూరు జిల్లాలో బలమైన నేతగా ఉన్నా.. ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల నుంచి మాత్రమే పోటీకి ఆసక్తిగా ఉన్నారు.

ఇద్దరికి సీట్లా..టీడీపీలో కొత్త టెన్షన్
నెల్లూరు జిల్లాలో ఇప్పుడు రెండు సీట్లు ఈ ఇద్దరికీ ఖరారైనట్లుగా ప్రచారం సాగుతోంది. దీనిని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వారు ఖండిస్తున్నారు. పార్టీ నిర్ణయం తమకు ఆమోదమే అయినా.. ఎవరికి వారు టికెట్లు ప్రకటించుకోవటం సరి కాదన్నారు. పార్టీ అధినేత నిర్ణయం తీసుకొనే వరకు ప్రచారం సరి కాదన్నారు. ఆనంకు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరిలో మేకపాటి కుటుంబం..వైసీపీ బలంగా ఉండటంతో నెల్లూరు రూరల్ తనకు సేఫ్ నియోజకవర్గంగా ఆనం భావిస్తున్నారని తెలుస్తోంది. వెంకటగిరి సిట్టింగ్ అయినా..అక్కడ పోటీకి ఆసక్తిగా లేరని సమాచారం. ఇటు వరుసగా రెండు సార్లు పోటీ చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గం పైనే కోటంరెడ్డి ఆశలు పెట్టుకున్నారు. అయితే, కోటంరెడ్డికి రూరల్ సీటు పైన హామీ దక్కిందని అనుచరులు చెబుతున్నారు. కానీ, ఆనంకు పార్టీ అధినాయకత్వంతో పాటు పవన్ కల్యాణ్ తో ఉన్న సత్సంబంధాలు కలిసి వస్తాయని చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు ఇదే వ్యవహారం జిల్లా టీడీపీలో ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications