పవన్ కళ్యాణ్ను ఎవరికైనా చూపించండ్రా!: ‘కాపు సీఎం’పై మంత్రి కొట్టు సంచలనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కాపు ముఖ్యమంత్రి అనేది హాట్ టాపిక్గా మారింది. ఏపీకీ కాపు సీఎం ఎప్పుడు అవుతారని, ఎవరు అవుతారనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై తాజాగా ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు సీఎం కావాలని తనకేం లేదని అన్నారు. టీడీపీ, జనసేనపై విమర్శలు గుప్పించారు.

‘కాపు సీఎం’పై మంత్రి కొట్టు కీలక వ్యాఖ్యలు
కాపులు ముఖ్యమంత్రి కావాలనే వారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట వెళ్లి కేరింతలు కొడుతున్నారని.. కాపుల్ని సీఎంగా చూడాలని వారికుంటుందేమో కానీ.. నాకెందుకు ఉంటుంది? అని మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కాపుల్ని సీఎంగా చూడాలన్న ఆలోచన మీకు లేదా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. పైవిధంగా సమాధానమిచ్చారు దేవాదాయ శాఖ మంత్రి.

పవన్ కళ్యాణ్ అంటే అభిమానమేనన్న మంత్రి కొట్టు, కానీ..
పవన్ కళ్యాణ్ అంటే తనకు అభిమానమేనని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. పవన్పై సామాజికవర్గ పరంగా అభిమానం ఉందన్నారు. అయితే, తామందరం బాధపడేలా ఆయన వ్యవహరిస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుది అపవిత్ర పొత్తు అని విమర్శించారు. పవన్ బీజేపీని పెళ్లి చేసుకుని టీడీపీతో సంసారం చేస్తానంటున్నారని ఘాటుగా స్పందించారు.

ఎవరికైనా చూపించండ్రా అంటూ పవన్పై కొట్టు
కాపుల పరువు తీయొద్దని పవన్ కళ్యాణ్ ను కోరుతున్నట్లు మంత్రి కొట్టు తెలిపారు. పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి చూసి.. 'ఆయన్ను ఎవరికైనా చూపించండ్రా' అంటూ ప్రజలు సినిమా డైలాగ్లు కొడుతున్నారని కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. అయితే, కాపు సీఎంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

బీఆర్ఎస్లోకి తోట అందుకేనంటూ మంత్రి కొట్టు
వైఎస్ జగ్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం కాకుండా అడ్డుకోవడం చంద్రబాబు, పవన్ వల్ల కాదని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. వంగవీటి రంగా హత్యపై అడిగిన మరో ప్రశ్నకు బదులిస్తూ.. దేవినేని అవినాశ్ వైసీపీలో ఎందుకున్నారో? వంగవీటి రాధా టీడీపీలో ఎందుకున్నారో? అనేది బెజవాడ ప్రజలను అడిగితే చెబుతారని అన్నారు. తెలంగాణలో ఉన్న వ్యాపారాలు, అక్కడ ఎదురయ్యే ఇబ్బందుల కారణంగానే తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారని చెప్పారు.












Click it and Unblock the Notifications