వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత - జనసేన ఎఫెక్ట్..!?
టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. జనసేనతో పొత్తు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఏపీలో పార్టీల జంపింగ్స్ మొదలయ్యాయి. కీలక నియోజకవర్గాల్లో ప్రత్యర్ధి పార్టీలను దెబ్బ తీసేందుకు పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఆ పార్టీకి నష్ట చేసేలా టీడీపీ కొత్త ఎత్తుగడలు మొదలు పెట్టింది. దీనికి కౌంటర్ గా టీడీపీకి బలం ఉన్న క్రిష్ణా జిల్లా లో వైసీపీ కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా ఆ పార్టీకి చెందిన నేతలను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే కొందరు ముఖ్య నేతలు అధికార పార్టీతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా...పార్టీ సీనియర్ నేత..టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు సమచారం. జనసేనతో పొత్తు కారణంగానే ఆ నేత అధికార పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం సాగుతోంది.

కైకలూరు లో పొత్తు ఎఫెక్ట్..
క్రిష్ణా జిల్లా లో తొలి నుంచి టీడీపీకి మద్దతుగా నిలుస్తోంది. 2019 ఎన్నికల్లో మాత్రం ఆ జిల్లా నుంచి టీడీపీ రెండు సీట్లకే పరిమితం అయింది. గన్నవరం.. విజయవాడ తూర్పు మినహా అన్ని సీట్లు వైసీపీ గెలిచింది. వచ్చే ఎన్నికల్లోనూ తమ పట్టు నిరూపించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ఈ పొత్తుతో అధికారం దక్కుతుందని భావిస్తున్న సమయంలోనే టీడీపీ లో సీనియర్లకు తమ సీట్ల పైన సందేహాలు మొదలువుతున్నాయి. కైకలూరు నియోకవర్గం టీడీపీలో కొంత కాలంగా డైలమా కనిపిస్తోంది. టీడీపీ వర్సస్ వైసీపీగా హోరా హోరీ పోరు ఉన్న ఆ నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో జనసేనకు కేటాయిస్తున్నట్లు టీడీపీ నేతల్లో ప్రచారం సాగుతోంది. ఇదే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పార్టీ మార్పు ఆలోచనకు కారణంగా చెబుతున్నారు.
వైసీపీకిలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
2009 ఎన్నికల్లో కైకలూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా జయమంగళం వెంకట రమణ గెలుపొందారు. 2014లో పొత్తుల్లో భాగంగా కైకలూరు సీటును బీజేపీకి కేటాయించారు. అక్కడ బీజేపీ అభ్యర్ధిగా గెలిచిన కామినేని శ్రీనివాస్ చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. అదే కామినేని 2009లో ప్రజారాజ్యం నుంచి ఇదే నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీలో మంత్రిగా చేసిన సమయంలో పవన్ - చంద్రబాబు మద్య సమావేశాలు.. నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. అప్పటికే పవన్ కల్యాణ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. టీడీపీతో పొత్తు వీడిన తరువాత కామినేని బీజేపీలోనే కొనసాగుతున్నారు. ఇక..కైకలూరు టీడీపీకి మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ కీలకంగా ఉన్నారు. అక్కడ పార్టీ అధికారికంగా నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతల కేటాయింపులో ఆలస్యం జరుగుతోంది. ఇదే సమయంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో మాజీ ఎమ్మెల్యే జయమంగలం వెంకట రమణ వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం సాగుతోంది.

జనసేనకు కైకలూరు సీటు ఇస్తారంటూ
టీడీపీ - జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్నా..రెండు పార్టీలు అధికారికంగా ప్రకటన చేయలేదు. అదే సమయంలో సీట్ల గురించి అప్పుడే అంతర్గతంగా సర్వేలు..నిర్ణయాలు జరుగుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే విజయవాడ పశ్చిమం..కైకలూరు సీట్లు దాదాపుగా జనసేకు ఖరారయ్యని జిల్లా టీడీపీ నేతలు అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు. అటు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సైతం తిరిగి సీటు దక్కించుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పలు నియోజకవర్గాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్న టీడీపీ నాయకత్వం కైకలూరు విషయంలో వేచి చూసే ధోరణితో ఉండటంతో మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకోవటం ఖాయమని ప్రచారం జరుగుతోంది. దీంతో..ఇప్పుడు కైకలూరు విషయంలో పార్టీ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంనేది చూడాలి.












Click it and Unblock the Notifications