క్రాస్ రోడ్డులో కృష్ణంరాజు, ఫిలింనగర్లో జీవిత, రాజశేఖర్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తరఫున గురువారం ప్రముఖ సినీ ప్రముఖులు జీవిత, రాజశేఖర్, కృష్ణంరాజులు ప్రచారం చేశారు. ఫిలింనగర్లో జీవిత, రాజశేఖర్లు, ముషీరాబాద్ నియోజకవర్గంలో రెబల్ స్టార్ కృష్ణం రాజులు ప్రచారం నిర్వహించారు. కృష్ణం రాజు మాట్లాడుతూ... సికింద్రాబాద్ ఎంపీగా బండారు దత్తాత్రేయను, ముషీరాబాద్ ఎమ్మెల్యేగా డాక్టర్ కె లక్ష్మణ్ను గెలిపించాలని కోరారు.
రెండు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి బిజెపితోనే సాధ్యమన్నారు. అవినీతి కుంభకోణాల కాంగ్రెసుకు ప్రజలు గట్టి బుద్ధి చెప్పాలని, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలను ఆదర్శ రాష్ట్రాలుగా బిజెపి తీర్చిదిద్దుతుందన్నారు. కాంగ్రెసుకు ఓటేస్తే అవినీతికి ఓటేసినట్లే అన్నారు.
బిజెపి, బిజెపి బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తేనే అబివృద్ధి అని రాజశేఖర్ జీవితలు అన్నారు. ఖైరతాబాద్ శాసన సభ అభ్యర్థిగా చింతల రామచంద్రా రెడ్డి, పార్లమెంటు అభ్యర్థిగా బండారు దత్తాత్రేయలను గెలిపించాలన్నారు. మన భవిష్యత్తు మన చేతిలోనే ఉందన్నారు. కల్లిబొల్లి మాటలు చెప్పే ఇతర పార్టీల నేతల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. మోడీ ప్రధాని అయితే దేశానికి అవినీతి నుంచి విముక్తి లభిస్తుందని శివాజీ రాజా అన్నారు.