ఏపీలో జగనే గెలుస్తాడు : కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. ఈనెల 18వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతోంది. ప్రజల నాడి పట్టుకునేందుకు వివిధ సంస్థలు, ఏజెన్సీలు సర్వేల పేరుతో ఫలితాలను వెల్లడిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఆయా రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఇస్తుండగా, మరికొన్ని సంస్థలు వ్యతిరేకంగా ఇస్తున్నాయి. అయితే ప్రజల నాడి ఎలా ఉంది? అనే విషయంలో వారి నాడిని కచ్చితంగా పట్టుకునే సంస్థలు కూడా ఉన్నాయి. ఇక ఏపీ రాజకీయాలపై తెలంగాణ రాజకీయ నేతలు సైతం స్పందిస్తున్నారు.
ఇటీవల తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీ రాజకీయాలపై మాట్లాడారు. త్వరలో ఏపీలో జరగబోయే ఎన్నికల్లో తిరిగి జగనే సీఎం అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో రాజకీయ పార్టీలన్నీ కూడా జగన్ను ఓడించాలని ప్రయత్నిస్తున్నాయని... మీ అంచనా ప్రకారం ఏపీలో ఎవరు విజయం సాధిస్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానం ఇస్తూ.. తనకున్న సమాచారం ప్రకారం ఏపీలో తిరిగి జగన్ అధికారం చేపడతారని ఆయన తెలిపారు.

తాజాగా తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఏపీ రాజకీయాల గురించి స్పందించారు. శనివారం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్లో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమని..వచ్చే ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారం చేపడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఐదేళ్లు ప్రజల తరుఫున పోరాటం చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో ఏపీ రాజకీయాల గురించి కూడా ఆయన స్పందించారు. తమకున్న సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్ తిరిగి అధికారంలోకి వస్తారని కేటీఆర్ తెలిపారు. ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చిన తమకు ఎటువంటి బాధ , ఇబ్బంది లేదని అంతిమంగా ప్రజలే గెలవాలని కేటీఆర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications