విశాఖలో కుమారస్వామి- స్టీల్ ప్లాంట్ రోడ్ మ్యాప్ ఆయన చేతిలో
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తోంది. పారిశ్రామికరంగ పురోగతి దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో నేడు అనకాపల్లి జిల్లా నక్కపల్లి రాజయ్యపేటలో ఆర్సెలర్మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా స్టీల్ ప్లాంట్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
చంద్రబాబు ఈ ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు. 1.3 లక్షల కోట్ల రూపాయల ఉక్కు ఫ్యాక్టరీ ఇది. ఈ కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి, ఆర్సెలర్మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్, ఇండియా ఛైర్మన్ ఆదిత్య మిట్టల్ పాల్గొననున్నారు. 5,400 ఎకరాల్లో రెండు దశల్లో నిర్మించే ఈ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్కు 18 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది. లక్ష మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.

తొలి దశలో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం గల కర్మాగారం ఏర్పాటు అవుతుంది. రెండో దశలో అదనంగా 10.5 మిలియన్ టన్నుల సామర్థ్యం చేరుతుంది. ఈ గ్రీన్ఫీల్డ్ కర్మాగారం భారత ఉక్కు మార్కెట్ డిమాండ్ను తీర్చడంలో కీలకం. కాగా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి హెచ్ డీ కుమారస్వామి, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ విశాఖపట్నానికి చేరుకున్నారు.
అదే సమయంలో విశాఖ స్టీల్ప్లాంట్ను కూడా ఆయన సందర్శించనున్నారు. ఇప్పటికే కొన్ని విభాగాలను మూసివేయడం, సుదీర్ఘకాలంగా కార్మిక సంఘాల నిరసన దీక్షలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కుమార స్వామి ప్లాంట్ ను సందర్శించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆయన స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో సమావేశమౌతారు. ప్లాంట్ ఉత్పాదక సామర్థ్యం, పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు.
అనంతరం కార్మిక సంఘాలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకుల అభిప్రాయలను కుమారస్వామి తెలుసుకుంటారు. ఈ ప్లాంట్ రివైవల్ ప్యాకేజీ, ఇతర అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఈ ప్యాకేజీని ప్రకటించిన తర్వాత సంస్థ సాధించిన పురోగతి, ఇతర అంశాలు ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు రావొచ్చు. మూసివేత వల్ల తలెత్తిన ఇబ్బందికర పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక వంటివి కుమారస్వామి దృష్టికి తీసుకెళ్తారని తెలుస్తోంది.
కాగా- కుమారస్వామితో టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటోన్న సమస్యలను ఆయనకు వివరించారు. పూర్తి వివరాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్లాంట్ కు మరింత ఆర్థిక వెసలుబాటు కల్పించడం, మైనింగ్, ముడిఇనుము కేటాయింపుల వంటి అంశాలను కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నింటి పట్లా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications