ఎక్కడున్నా కలుస్తాం, ఒప్పందం గుట్టు చెప్తా: లగడపాటి
న్యూఢిల్లీ: తాము ఎక్కడున్నా సభాపతి మీరా కుమార్ను కలుస్తామని, రాజీనామాలను ఆమోదింప చేసుకుంటామని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మంగళవారం చెప్పారు. ఆయన ఉదయం సభాపతి కార్యాలయానికి వెళ్లారు. మీరా కుమార్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తాము స్పీకర్ ఎక్కడున్నా కలిసి రాజీనామాలను ఆమోదింప చేసుకుంటామన్నారు. ఇతర పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తే వెంటనే ఆమోదించి తమ రాజీనామాలు ఎందుకు ఆమోదించలేదని ఆయన ప్రశ్నించారు.

తమ రాజీనామాలు పెండింగులో పెట్టడం సరికాదన్నారు. తాము రెండు నెలల క్రితం రాజీనామా చేశామని అయినా పెండింగులో పెట్టడమేమిటని ప్రశ్నించారు. తమ రాజీనామాలతో అధిష్టానం దిగి వచ్చిందన్నారు. అందుకే ఆంటోని కమిటీని వేసిందని లగడపాటి చెప్పారు.
ఇప్పటికైనా స్పీకర్ తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారు. ప్రత్యేక అధికారాలతో స్పీకర్ పార్లమెంటు సమావేశాల సమయంలో తమను సస్పెండ్ చేశారన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ప్రజల ఉద్యమాలతో పార్టీలలో మార్పు కనిపిస్తోందని చెప్పారు.
ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా ప్రజలు బుద్ది చెబుతారన్నారు. ఎవరెవరి మధ్య ఒప్పందం జరిగింది, ఎలా జరిగిందో తన రాజీనామా ఆమోదం పొందాక వెల్లడిస్తానన్నారు. 25 మంది సీమాంధ్ర ఎంపీలు మద్దతు అవసరం లేదన్నట్లుగా తమ పార్టీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications