నక్కలపాలుచేశాడు: బాబుపై లక్ష్మీపార్వతి, హోదా కావాలని బాలయ్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి తీవ్రంగా ధ్వజమెత్తారు. పార్టీని చంద్రబాబు నక్కల పాలు, కుక్కల పాలు చేశారని ఆమె అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత శనివారంనాడు ఆమె మీడియాతో మాట్లాడారు.
పార్టీ చంద్రబాబు చేతిలోకి వచ్చిన తర్వాత ప్రజలకు దూరమై పోయిందని, పార్టీ విధానాలను చంద్రబాబు భూస్థాపితం చేశారని ఆమె విరుచుకుపడ్డారు. చంద్రబాబు అవినీతి చిట్టా ప్రధాని నరేంద్ర మోడీ వద్ద ఉందని, ఓటుకు నోటు కేసు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతిలో ఉందని, దీంతో చంద్రబాబు ప్రత్యేక హోదాపై గానీ జలాలపై గానీ పోరాటం చేయలేరని ఆమె అన్నారు.
కేవలం పార్టీ పేరు చెప్పుకుని చంద్రబాబు బతుకున్నారని, ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావించడానికి వీలు లేని స్థితికి పార్టీని దిగజార్చారని ఆమె అన్నారు.
తిరుపతి టౌన్ క్లబ్ సెంటర్లో చంద్రబాబు, బాలకృష్ణ, బొజ్జల గోపాల కృష్ణారెడ్డిలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బడుగు, బలహీనవర్గాల కోసం ఎన్టీఆర్ అహర్నిశలు కృషి చేశారని, అందుకే ఆయన ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉన్నారని బాలకృష్ణ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై బీజేపీతో మాట్లాడతామని బాలకృష్ణ చెప్పారు. హంద్రీనీవా పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. తిరుపతిలో జరుగుతున్న మహానాడులో ఆయన మాట్లాడారు. పేదల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ ఎంతో పాటుపడ్డారని అన్నారు. తెలుగు వెలుగు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఏపీని అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకే ఉందని ఆయన అన్నారు.