మైలవరం నియోజవర్గంపై తాజా నివేదిక..ఆ పార్టీ వైపు మొగ్గు
సార్వత్రిక ఎన్నికలకు రాజకీయ పార్టీలన్నీ కూడా సన్నద్దం అవుతున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన , బీజేపీ కూటమి కట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఎన్నికలకు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా ,మైలవరం నియోజకవర్గంలో రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉందనేది ఈ సమీక్ష ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ముందుగా మైలవరం నియోజకవర్గం గురించి చర్చించుకుంటే ఇక్కడ ఓటర్లు ఎప్పుడు కూడా ఒక పార్టీకి మద్దతిచ్చిన పరిస్థితులు లేవు. 2004లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించగా, 2009,2014 ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ విజయం సాధించింది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మైలవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారనే ఉత్కంఠ నాయకుల్లో నెలకొంది. మైలవరం BC జనరల్ నియోజకవర్గం.

ఇక్కడ బీసీల ఓట్లర్లు అధికంగా ఉన్నప్పటికీ.. రెడ్డి, కమ్మ సామాజికవర్గాలదే అధిపత్యం నడుస్తుంటుంది.గత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఇద్దరు కమ్మ సామాజికవర్గాలకు చెందినవారే బరిలోకి దిగారు. వైసీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేయగా, టీడీపీ నుంచి దేవినేని ఉమ రంగంలోకి దిగారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ విజయం సాధించారు.
ఇటీవల వైసీపీకి గుడ్ చెప్పిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరి ఆ పార్టీ టికెట్ దక్కించుకున్నారు. మైలవరం టికెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమకు మొండిచేయి ఎదురైంది. ఇక వైసీపీ నుంచి బీసీ కులానికి చెందిన సర్నాల తిరుపతిరావు యాదవ్ అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఖారారు చేసింది. టీడీపీ , వైసీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ నేతలు కత్తులు దూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఇప్పటి వరకు నియోజకవర్గ పరిస్థితిని గమనిస్తే టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఆర్థికంగా బలవంతుడు కావడం ఆ పార్టీకి ప్లస్గా మారింది. దీనికి తోడు గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచి ఉండటం కూడా టీడీపీ అభ్యర్థి కలిసొచ్చే అంశమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే స్థానిక నేత కాకపోవడం వసంత కృష్ణ ప్రసాద్కు పెద్ద మైనస్గా మారింది. దీనికి తోడు గతంలో దేవినేని ఉమతో ఉన్న విభేదాలతో ఆయన అనుచరులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం వసంత కృష్ణ ప్రసాద్కు సంకటంగా మారింది.

ఇక వైసీపీ అభ్యర్థి విషయానికి వస్తే సర్నాల తిరుపతిరావు ఎంపీపీగా పని చేశారు. ఆయన ఆర్థికంగా వెనుకపడిన వ్యక్తి. సర్నాల తిరుపతిరావు అభ్యర్థిత్వంపై పార్టీలోనే తొలుత కొంత వ్యతిరేకత వ్యక్తం అయింది. అయితే పార్టీ అధినేత ఆదేశాలతో నేతలు సర్నాల తిరుపతిరావుతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానికుడు కావడం సర్నాల తిరుపతిరావుకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలే తనని గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రెడ్డిగూడెం, మైలవరం, జి. కొండురు మండలాలు వైసీపీకి అనుకూలంగా ఉండగా, ఇబ్రహింపట్నం, కొండపల్లి, గొల్లపూడి వంటి మండలాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంత ఓటర్లు వైసీపీకి మద్దతుగా ఉండగా, పట్టణ ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. తటస్థ ఓటర్లు ఏ పార్టీకి అండగా ఉంటే ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరీ వచ్చే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీకి అండగా ఉంటారో చూడాలి.












Click it and Unblock the Notifications