ఓయు: ప్రభుత్వంపై గుర్రు, విద్యార్థులపై మళ్లీ లాఠీఛార్జ్!
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం మరోసారి వేడెక్కింది. విభజనకు ముందు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఓయు విద్యార్థులు.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన గళమెత్తుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయవద్దని ఓయులో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో తార్నాకలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.
కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయవద్దని ఓయులో గురువారం కూడా విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రోజు మరోసారి వారు ఆందోళన చేపట్టారు. తార్నాక వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన నిరుద్యోగులను నట్టేట ముంచేలా కేసీఆర్ మంత్రివర్గం నిర్ణయాలు తీసుకున్నదని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య అధ్యక్షులు ఆంజనేయ గౌడ్ గురువారం ధ్వజమెత్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడం నిరుద్యోగులకు ద్రోహం చేయడమే అన్నారు.