ఆంధ్రప్రదేశ్ లో అసమ్మతి నేతలకు బుజ్జగింపులు, ఎవరి స్టైల్లో వాళ్లవాళ్ల హామీలు, పార్టీలు జంప్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి తాడోపేడో తేల్చుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుకుంటున్నారు. ఐదు సంవత్సరాలు అధికారానికి దూరం అయిన టీడీపీ నాయకులు కొంతమంది ఇంతకాలం వైసీపీ ప్రభుత్వం దెబ్బతో ఎక్కడి వాళ్లు అక్కడే గప్ చుప్ అంటూ కాలం గడిపేశారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా ఆ టీడీపీ నాయకులు బయటకు వస్తున్నారు.
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నాయకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకేఒక్క చాన్స్ అంటూ గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి సీఎం కావాలని ఆశపడుతున్నారు. ఇలా అధికారం కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు.

గతంలో అసెంబ్లీ సీట్లు, ఎంపీ సీట్లను మొహమాటానికి ఇచ్చి చేతులు కాల్చుకున్న టీడీపీ ఇప్పుడు అలాంటి మొహమాటాలకు చెక్ పెట్టి ఆచితూచి టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. కొన్ని నియోజక వర్గాల్లో అసమ్మతి ఎదురౌతున్నా వారిని బుజ్జగించడానికి నారా చంద్రబాబు నాయకుడు, పవన్ కల్యాణ్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే నియోజక వర్గాల్లోని అసమ్మతి నాయకులను బుజ్జగించడానికి రంగంలోకి దిగారు.
ఎమ్మెల్యే సీటు రాలేదని కొందరు నాయకులు ఇప్పటికే పార్టీలు మారిపోతున్నారు. మా నాయకుడికి టిక్కెట్ ఇవ్వరా, మీ అభ్యర్థి ఎలా గెలుస్తాడో చూస్తామని కొన్ని నియోజక వర్గాల్లోని కార్యకర్తలు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ సీపీతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశంలో, జనసేనలో, బీజేపీలో కూడా ఇప్పుడు అసమ్మతి నేతలు పెరిగిపోతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ప్రకటించక ముందు ఉన్న సీన్ ఇప్పుడు లేదు అని అన్ని పార్టీల నాయకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయానికి ఓటర్లు, నాయకుల మనసు ఎలాగైనా మారిపోయే పరిస్థితి వస్తుందని కొందరు నాయకులు అంటున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగించాలని ఇప్పటికే వైసీపీలో జిల్లా ఇన్ చార్జ్ మంత్రులకు, పార్టీ సీనియర్ నాయకులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.
ఇక తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేనలో పవన్ కల్యాణ్ అసమ్మతి నేతలకు ఫోన్లు చేసి వారికి నచ్చచెప్పి పార్టీలు మారిపోకుండా చూస్తున్నారని తెలిసింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లోని పలు నియోజక వర్గాల్లో మాకు ఎమ్మెల్యే సీటు రాలేదని కొందరు, మా నాయకుడికి ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదని కొందరు లోలోపల రగిలిపోతున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications