SP Balu "భారత రత్నం" కాడా..? పద్మవిభూషణ్తో సరిపెట్టిన కేంద్రం
ప్రముఖ నేపథ్య గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కేంద్రం పద్మవిభూషణ్తో గౌరవించింది. ఎన్నో సుమధుర గీతాలను తన గొంతు నుంచి జారి విడిచిన ఎస్పీబీని కేంద్రం పద్మవిభూషణ్తో గౌరవించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.గతేడాది సెప్టెంబర్లో ఈ గాన గంధర్వుడు భువి నుంచి దివికేగారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యంను ఒక్కసారి గుర్తు చేసుకుందాం...
నెల్లూరులో జననం...
నెల్లూరు జిల్లాలో 1946 జూన్ 4వ తేదీన సాంబమూర్తి శకుంతలా దేవీలకు బాలసుబ్రహ్మణ్యం జన్మించారు. ఇంజినీర్ అవ్వాల ని తొలుత భావించినప్పటికీ మధ్యలోనే విరమించుకుని సింగర్గా స్థిరపడ్డారు. బాలసుబ్రహ్మణ్యం చదువుకునే రోజుల్లో ఎన్నో పాటలు పోటీల్లో పాల్గొని చాలా బహుమతులు గెలుచుకున్నారు. ఇక 1966లో తొలిసారిగా ఒక సినిమాకు పాట పాడారు. శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రానికి తొలిసారిగా పాట పాడి తన సినీ కెరీర్ను ప్రారంభించారు బాలసుబ్రహ్మణ్యం. అప్పుడు ప్రారంభమైన తన పాట తన చివరి శ్వాస వరకు అలరించింది. ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని ప్రధాన భారతీయ భాషల్లోను బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడారు.
ఖండాంతరాలను తాకిన బాలు గొంతు
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు విదేశాల్లో కూడా అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. తన గొంతు ఖండాంతరాలను తాకింది. శంకరాభరణంలో బాలు పాడిన పాటలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆ చిత్రానికి కళాతపస్వి కే విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.1981లో ఏక్ దుజే కేలియే చిత్రానికి పాడి బాలీవుడ్లో అరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో పాడిన పాటకు జాతీయ అవార్డు బాలును వరించింది. ఇక తన ఆప్త మిత్రుడు సంగీత దర్శకుడు ఇళయరాజ సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడారు. వీరిది ఎప్పటికీ హిట్ పెయిర్గా నిలిచింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సాగరసంగమం, స్వాతిముత్యం,రుద్రవీణ చిత్రాలకు జాతీయ అవార్డు వరించింది.
రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో బాలు గొంతు తప్పనిసరి
ఇక బాలీవుడ్లో సల్మాన్ ఖాన్కు పాటలు పాడారు బాలసుబ్రహ్మణ్యం. 1989లో వచ్చిన సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ మైనే ప్యార్ కియా చిత్రంలో దిల్ దీవానా పాటకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు బాలును వరించింది. ఆ తర్వాత మరో దశాబ్దకాలం పాటు సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలకు రొమాన్స్ పాటలకు గాత్రం అందించారు బాలు. ఇక హమ్ ఆప్కే హే కోన్ చిత్రానికి లతా మంగేష్కర్తో కలిసి దీదీ తేరా దేవర్ దివానా అనే పాటను బాలు పాడారు. ఈ పాట సూపర్ హిట్ కావడంతో బాలు క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఏఆర్ రెహ్మాన్ ఒక చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారంటే అందులో బాలు గొంతు వినిపించాల్సిందే. రెహ్మాన్ తొలిసారిగా సంగీత దర్శకత్వం వహించిన రోజా చిత్రంలో బాలు పాడిన నా చెలి రోజావే పాట అభిమానుల్లో ఎలాంటి ముద్ర వేసిందో చెప్పక్కర్లేదు.
భారత రత్న ఇవ్వకపోవడాన్ని ప్రశ్నిస్తున్న కొందరు
ఇదిలా ఉంటే బాలు మరణం తర్వాత ఏపీ తమిళనాడుతో సహా దక్షిణాదిలోని దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయనకు భారత రత్న పురస్కారం ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానిక లేఖలు రాశాయి. జగన్, కేసీఆర్లాంటి సీఎంలు అయితే కేంద్ర ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కూడా కోరుతామని నాడు చెప్పారు. ఇప్పటికే జాతీయ అవార్డుల్లో దక్షిణాదిపై చిన్న చూపు ఉందనే వాదనకు ఇవాల్టి కేంద్రం చర్య మరింత బలం చేకూర్చినట్లయ్యింది.
తన గాత్రంతో దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న ఈ దిగ్గజ గాయకుడు ఇక లేరనే వార్తను సంగీత అభిమానులు జీర్ణించుకోలేకపోయినప్పటికీ కేంద్రం ఎస్పీబీని రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్తో గౌరవించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు భారత రత్న ఇవ్వకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సారి భారత రత్న పురస్కారం ఎవరికనేది కేంద్రం ఇంకా ఖరారు చేయలేదు.