ఏపీలో తగ్గుతున్న మద్యం ధరలు-ప్రస్తుతానికి ఈ 3 బ్రాండ్లు-త్వరలో మరిన్ని..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో నాసిరకం మద్యం ఎక్కువ ధరలకు అమ్మారని ఆరోపణలు చేసిన కూటమి నేతలు తమ ప్రభుత్వం వచ్చాక పాత బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చినా ధరలు మాత్రం తగ్గలేదు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఇప్పుడు వాటిని తగ్గించే దిశగా మద్యం కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ఆయా కంపెనీలు క్రమంగా ధరలు తగ్గించేందుకు అంగీకరిస్తున్నాయి. ఇప్పటికే మూడు కంపెనీల ధరల తగ్గింపు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గించడానికి మూడు మద్యం కంపెనీలు ముందుకు వచ్చాయి. వీటిలో మ్యాన్షన్ హౌస్, రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ధరలు తగ్గిస్తూ కంపెనీలు చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో అమల్లోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం మద్యం షాపుల్లో పాత ధరలతో ఉన్న బాటిళ్లను ఆదే ధరలకే విక్రయించి కొత్తగా వచ్చే వాటికి మాత్రం తగ్గించిన ధరలతో అమ్మబోతున్నారు. త్వరలో మరో రెండు కంపెనీలు ధరలు తగ్గించబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ధరలు తగ్గించిన మ్యాన్షన్ హౌస్ విషయానికొస్తే.. 2019లో టీడీపీ ప్రభుత్వంలో క్వార్టర్ బాటిల్ రూ.110 ఉండగా వైసీపీ హయంలో మొదట్లో రూ.300కు విక్రయించారు. దీనిపై విమర్శలు రావడంతో రూ.220కి తగ్గించారు. అయితే ప్రస్తుతం దీని క్వార్టర్ ధర రూ.220 నుంచి రూ.190కి తగ్గింది. ఇందులో హాఫ్ బాటిల్ ధర రూ.440 నుంచి రూ.380కి, ఫుల్ బాటిల్ ధర రూ.870 నుంచి రూ.760కి తగ్గింది. అలాగే రాయల్ చాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రూ.230 నుంచి రూ.210కి, ఫుల్ బాటిల్ ధర రూ.920 నుంచి రూ.840కి తగ్గింది. యాంటిక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ ధర రూ.1600 నుంచి రూ.1400కు తగ్గింది.
కూటమి ప్రభుత్వం ఇప్పటికే మద్యం ధరలపై విమర్శలు రావడంతో వీటి సవరణకు ఓ కమిటీని నియమించింది. త్వరలో ఈ కమిటీ అన్ని బ్రాండ్ల కంపెనీలతో ధరల సవరణపై చర్చించనుంది. అందుకు అనుగుణంగా కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. కమిటీ నిర్ణయించక ముందే కొన్ని మద్యం కంపెనీలు రేట్లు తగ్గించుకుంటున్నాయి. బాటిల్ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది, ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో పాటు వేరే రాష్ట్రాల్లో అమ్ముతున్న ధరలను కమిటీ పరిశీలించనుంది.












Click it and Unblock the Notifications