తిరుమలలో విశేష ఉత్సవాలు- ఉగాది తరువాత
Tirumala: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 64,279 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 24,482 మంది తలనీలాలను సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.36 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనం టోకెన్లను పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

రేపు తెలుగు సంవత్సరాది ఉగాది పండగ. శ్రీ విశ్వావసు నామ ఉగాది పండగను అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటోన్నారు. వేలాదిమంది భక్తుల సమక్షంలో శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా మలయప్పస్వామివారు ఆలయంలోనికి ప్రవేశిస్తారు.
అనంతరం శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. ఆ తరువాత పంచాగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. టీటీడీ ఆగమ పండితులు, అర్చకులు శ్రీవారి ఆలయం బంగారు వాకిలి వద్ద శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తిరుమలలో ఏప్రిల్లో జరిగే పండగలు, విశేష ఉత్సవాల జాబితాను టీటీడీ అధికారులు విడుదల చేశారు. శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేక ఆస్థారం, ఛైత్ర పౌర్ణమి గరుడ సేవ, తుంబురు తీర్థ ముక్కోటి వంటి ఉత్సవాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా రోజుల్లో శ్రీవారికి ప్రత్యేక పూజలు, విశేష అలంకారాలు, సేవలను నిర్వహిస్తారు టీటీడీ అర్చకులు.
శ్రీరామనవమిని పురస్కరించుకుని ఏప్రిల్ 6వ తేదీన ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజు శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం ఉంటుంది. 8వ తేదీన సర్వ ఏకాదశి. 10 నుండి 12వ తేది వరకు వసంతోత్సవాలు. 12న చైత్ర పౌర్ణమి గరుడ సేవ, అదే రోజున తుంబురు తీర్థ ముక్కోటిని వైభవంగా నిర్వహించనున్నారు.
ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనం ఇస్తారు. భక్తులను కటాక్షిస్తారు.
23వ తేదీన భాష్యకార్ల ఉత్సవం ఆరంభమౌతుంది. 24న మతత్రయ ఏకాదశి, 30న పరశురామ జయంతి, భృగు మహర్షి వర్ష తిరు నక్షత్రం, శ్రీనివాస దీక్షితులు వర్ష తిరు నక్షత్రం, అక్షయ తృతీయతో ఉత్సవాలు ముగుస్తాయి.












Click it and Unblock the Notifications