ప్రధాని మోడీతో సుజనా చౌదరి భేటీ: బీజేపీపై టీడీపీ ఎంపీల కొత్త ఎత్తు
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజనా చౌదరి మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఏపీకి ఇచ్చిన హామీలు, విభజన అంశాలపై వారు చర్చించనున్నారు. ఈ విషయంలో ప్రధాని మోడీతో మరోసారి భేటీ కావాలని టీడీపీకి కేంద్రమంత్రి రాజ్నాథ్ సూచించిన విషయం తెలిసిందే.
Recommended Video
గంటకుపైగా వేచిచూసి 15ని.ల్లోనే: రాజ్నాథ్తో భేటీపై సుజనా షాకింగ్, అందుకే బాబు నిరసన
ఈ నేపథ్యంలో ఉదయం పదకొండు గంటలకు సుజనా చౌదరి ప్రధానిని కలిశారు. వీరి కలయిక ఆసక్తిని రేపుతోంది. సోమవారం రాజ్నాథ్ను కలిసిన తర్వాత భేటీ ఏమాత్రం సంతృప్తికరంగా లేదని టీడీపీ చెప్పింది. దీంతో ఇది ఆసక్తిని కలిగిస్తోంది.
ఏపీ ఎంపీల నిరసన
ఏపీకి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు లోపల, వెలుపల నిరసన వ్యక్తం చేశారు. సమావేశాలకు ముందు టీడీపీ వైసీపీ ఎంపీలు పోటాపోటీగా గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన నిర్వహించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
రాజ్యసభలో కేవీపీ
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు కేవీపీ రామచంద్ర రావు రాజ్యసభలో తన ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఏపీకి న్యాయం చేయాలంటూ ఆయన నినాదాలు చేశారు. లోకసభలో టీడీపీ ఎంపీలు వెల్లోకి వెళ్లారు. కాగా, ఏపీ ఎంపీలకు తోడు విపక్షాల ఎంపీల నిరసన నేపథ్యంలో ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
నారదుడి వేషధారణలో శివప్రసాద్
టీడీపీ ఎంపీ శివప్రసాద్ నారదుడి వేషధారణలో పార్లమెంటు సమావేశాలకు వచ్చారు. నాడు నారదుడు లోక కళ్యాణం కోసం పని చేశారని, అందుకే తాను ఈ గెటప్లో వచ్చానని చెప్పారు. ప్రధాని మోడీ తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీకి హామీలు ఇచ్చారని, నాలుగేళ్లయినా ఏమీ ఇవ్వలేకపోయారన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి మోడీకి తెలియదా అని ప్రశ్నించారు.
టీడీపీ ఎంపీల కొత్త ఎత్తు
కాగా, గతంలో తన ఢిల్లీ పర్యటనలో ప్రధాని వద్ద ప్రస్తావించిన సమస్యలతో పాటు బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు లేకపోవటంపై ప్రధానికి వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు అంతకుముందు దిశానిర్థేశం చేశారు. ప్రధాని తమకు సమయం కేటాయించారని ఎంపీలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీలంతా ప్రధాని వద్దకు వెళ్లకుండా అయిదుకురు సభ్యుల బృందం మాత్రమే వెళ్లి కలవాలని, మిగిలిన వాళ్లు పార్లమెంట్లో నిరసన తెలపాలన్నారు. ఇది టీడీపీ కొత్త ఎత్తుగా చెప్పవచ్చు. ఓ వైపు చర్చలు జరుపుతూనే మరోవైపు నిరసనలు వ్యక్తం చేస్తోంది.