జగన్ పై విరుచుకు పడిన లోకేష్, యనమల .. రాష్ట్రంలో వైసీపీ చెత్తపాలన, హింసపై ఆగ్రహం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై, జగన్ పాలనపై టీడీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు గాంధీ జయంతి నాడు కూడా ఏపీలో వైసీపీ అరాచకాలంటూ లోకేష్ ఫైర్ అయ్యారు. అంటరానితనం లేని సమసమాజ నిర్మాణం జరగాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గాంధీ జయంతి సందర్భంగా కోరారు. మహాత్ముని కలలు నెరవేరాలంటే పాలకుల్లో చిత్తశుద్ధి ఉండాలని నారా లోకేష్ పేర్కొన్నారు.
గాంధీజీ కోరుకున్న సమాజం నిర్మించగలమా? లోకేష్ ప్రశ్న
అవినీతిపరుల చేతికి అధికారం ఇచ్చి, గాంధీజీ కోరుకున్న సమాజాన్ని నిర్మించగలమా? అంటూ ప్రశ్నించారు. మహోన్నత ప్రజానాయకుడు గాంధీజీ బోధనలను, సచ్చరిత్రను స్మరించుకుందాం అని నారా లోకేష్ గాంధీ మహాత్ముని గుర్తు చేసుకున్నారు. పురుషుల తో పాటు మహిళలు సైతం సమాన హక్కు అనుభవించగలిగే రోజు రావాలన్నారు. మాదకద్రవ్యాలు లేని విధంగా దేశం రూపుదిద్దుకోవాలి అని లోకేష్ ఆకాంక్షించారు. జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ గాంధీ జయంతి నాడు లోకేష్ సెటైర్లు వేశారు.

గాంధీ జయంతి నాడు కూడా దాడులు .. దళితులకు జీవించే హక్కు లేదా ?
ఇదే సమయంలో రాష్ట్రంలో దళితులకు జీవించే హక్కు లేదని, ఏకంగా గాంధీ జయంతి రోజు దళితుల తల పగలగొట్టి మరీ చెప్పారు వైసీపీ నేతలు అంటూ ట్విట్టర్ వేదికగా లోకేష్ ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం సుంకర పేటలో దళితులపై వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేష్ చెప్పారు. విచక్షణ రహితంగా కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని లోకేష్ పేర్కొన్నారు. దళితుల పై దాడికి తెగబడిన వైసిపి నాయకులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
జగన్ పాలనలో అడుగడుగునా హింసా, దౌర్జన్యాలు
టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు జగన్ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన లో అడుగడుగునా హింస దౌర్జన్యాలు రాజ్యమేలుతున్నాయి అని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక తాజాగా స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన క్లాప్ కార్యక్రమంపై యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల స్వేచ్ఛ హరిస్తూ స్వచ్ఛ సంకల్పం నిర్వహణ హాస్యాస్పదంగా ఉందని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు.
జగన్ పాలన చెత్త పాలన .. జాతిపితను అవమానించేలా జగన్ తీరు
ప్రజలపై చెత్త పన్ను వేస్తూ సీఎం జగన్ చెత్త పాలనకు శ్రీకారం చుట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు .గాంధీజీ ఫోటో పక్కన జగన్ బొమ్మ పెట్టడం జాతిపిత అవమానించడమేనని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. కమీషన్ల కోసమే చెత్త వాహనాలను కొనుగోలు చేశారు తప్ప ప్రజాక్షేమం కోసం కాదని యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. అవినీతి కుంభకోణాలకు జగన్ రెడ్డి పాలన కేరాఫ్ అడ్రస్ గా మారిందని యనమల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీజీ అహింసను బోధిస్తే, జగన్ హింస పాలన అందిస్తున్నారని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ జయంతి ముందురోజు మద్యం పాలసీ పేరుతో రాష్ట్రంలో మద్యం వ్యాపార విస్తరణకు జగన్ సర్కారు శ్రీకారం చుట్టిందని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఏపీలో జగన్ పాలన ఉన్నంతకాలం ఈ అరాచకాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు.












Click it and Unblock the Notifications