అమరావతిలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తాం, వారు ఒక్క ఐటీ సంస్థను తేలేదు: లోకేష్
2022 నాటికి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రాజధాని, పరిసర ప్రాంతాల్లో మూడు ఐటీ క్లస్టర్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు.
అమరావతి: 2022 నాటికి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రాజధాని, పరిసర ప్రాంతాల్లో మూడు ఐటీ క్లస్టర్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. మంగళగిరి ఆటోనగర్లో అక్షర ఎంటర్ప్రైజెస్, కేజే సిస్టమ్ ఐటీ సంస్థలకు మంత్రి లోకేశ్ ఇవాళ భూమి పూజ చేశారు.
ఒక్క మంగళగిరి ఐటీ క్లస్టర్లోనే 10వేల ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు చెప్పారు. గన్నవరంలోని మేధా టవర్స్ నిర్మాణం 2010లోనే పూర్తయినప్పటికీ, అప్పటి ప్రభుత్వం ఒక్క ఐటీ సంస్థను కూడా తీసుకురాలేకపోయిందన్నారు.
తాము వచ్చిన తర్వాత మేధా టవర్స్ నిండిపోయి రెండో దశకు శంకుస్థాపన చేశామన్నారు. చిన్న ఐటీ సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నామని, అనుమతులన్నీ శరవేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. తాను కేవలం 6గంటల్లోనే ఫైళ్లను పరిష్కరిస్తున్నానని, పెట్టుబడులు పెట్టేవారు ముందుకు రావాలన్నారు.