ఢిల్లీలో ఓకే సార్ అంటూ గంగిరెద్దుల్లా తల ఆడించటానికా ఇరవై ఎనిమిది మంది ఎంపీలు : లోకేష్ ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతోంది. నిన్న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ 100% విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తా మని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈక్విటీ షేర్లు లేవని తేల్చి చెప్పారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తో సంప్రదింపులు జరిపిన తర్వాతనే విశాఖ స్టీల్ ప్లాంట్ పై నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష టిడిపి నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
విశాఖ ఉక్కు ను కేంద్రం అమ్మేస్తోంది .. సీఎం జగన్ రెడ్డి కొంటున్నాడన్న లోకేష్
జగన్ రెడ్డి తన కేసుల మాఫీ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం అమ్మకపు నిర్ణయానికి సరే అన్నారని విమర్శిస్తున్నారు . టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో జగన్ సర్కారు తీరు పై నిప్పులు చెరిగారు. విశాఖ ఉక్కు ను కేంద్రం అమ్మేస్తోంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంటున్నాడని లోకేష్ విమర్శించారు. అంతేకాదు ఢిల్లీలో ఓకే సార్ అంటూ గంగిరెద్దులా తల ఆడించటానికా ఇరవై ఎనిమిది మంది ఎంపీలు ఎందుకు దండగ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్.
జగన్ రెడ్డి లేఖలతో కాలక్షేపం చేస్తున్నారని ఆగ్రహం
విశాఖ ఉక్కును తుక్కులా కొట్టేయడానికి జగన్ ఎన్ని కుట్రలు చేసినా వాటిని భగ్నం చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తామని నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రజల హక్కులు కాపాడలేని వారు ఎంత ఎంత మంది ఉనా ప్రయోజనం లేదని వైసీపీ ఎంపీల పై నిప్పులు చెరిగిన లోకేష్ నిర్మల సీతారామన్ చేసిన ప్రకటనపై ఏపీ సర్కార్ ను ప్రశ్నించారు.
అన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పే చేస్తున్నాం జగన్ రెడ్డి అంగీకారంతోనే విశాఖ ఉక్కు అమ్మకం ప్రక్రియ జరుగుతుందని కేంద్ర చాలా స్పష్టంగా తెలియజేసింది అని పేర్కొన్న లోకేష్, విశాఖ ఉక్కు పరిరక్షణ పేరు చెప్పి జగన్ రెడ్డి లేఖలతో కాలక్షేపం చేస్తున్నారని, డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు డ్రామాలు ఆపితే మంచిది అంటూ లోకేష్ హితవు పలికారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కొనసాగుతున్న ఆందోళనలు
మరోపక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బిజెపి , జనసేన లు తమ స్టాండ్ తెలియజేయాలని, కార్మికుల పక్షాన పోరాటం చేసి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి అందరూ కలిసి రావాలని డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. ఇంకో వైపు ఎమ్మెల్యేలు , ఎంపీలు అందరూ రాజీనామాలు చేసి, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించడానికి పాటుపడాలని పలువురు విశాఖ ప్రాంతానికి చెందిన రాజకీయ నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సాగరతీర నగరంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళనలు కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.