మాట తప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ కరెంట్ చార్జీల ఉగాది బాదుడు: లోకేష్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనకు విద్యుత్ ఛార్జీల పెంపు నిదర్శనమని మండిపడుతున్నారు. ఇప్పటికే ఐదు సార్లు విద్యుత్ ఛార్జీల భారం మోపారని, సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు విద్యుత్ చార్జీలు పెంచుతూ ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూడేళ్లలో కరెంటు చార్జీలు భారీగా పెంచి జనానికి షాక్ కొట్టించారు జగన్
తాజాగా జగన్మోహన్ రెడ్డిని విద్యుత్ చార్జీల పెంపుపై టార్గెట్ చేసిన లోకేష్ జగన్రెడ్డి మాట ఇచ్చాడంటే, దానికి రివర్స్ చేస్తాడంతే! మాట తప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్, మడమ తిప్పుడుకి ఐకాన్ వైయస్ జగన్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. కరెంటు చార్జీలు బాదుడే బాదుడంటూ నాడు జగన్ తీసిన దీర్ఘాలు స్థాయిలోనే మూడేళ్లలో కరెంటు చార్జీలు భారీగా పెంచి జనానికి షాక్ కొట్టించారు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై లోకేష్ అసహనం వ్యక్తం చేశారు.
ఏపీలో సామాన్యులపై జగన్ సర్కార్ మరో పిడుగు వేసింది
కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్లను తీసుకొచ్చి, ఏపీలో సామాన్యులపై జగన్ సర్కార్ మరో పిడుగు వేసిందని లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. 30 యూనిట్ల వారికి యూనిట్కు 45 పైసలు పెంచారు. 31 నుంచి 75 యూనిట్ల వారికి యూనిట్కు 91 పైసలు పెంచారు. 76 నుంచి 125 యూనిట్ల వారికి యూనిట్కు రూ.1.40 పెంచారు. అలాగే 126 నుంచి 225 యూనిట్ల వారికి యూనిట్కు రూ.1.57పెంచగా, 226 నుంచి 400 యూనిట్ల వారికి యూనిట్కు రూ.1.16 పెంచారు. 400 యూనిట్లపైన వారికి యూనిట్కు 55 పైసలు పెంచడం ఏ రేంజ్ బాదుడో జగన్రెడ్డే చెప్పాలి అంటూ నారా లోకేష్ నిప్పులు చెరిగారు.
వేసవి షాక్ ఇచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
విద్యుత్ చార్జీలను భారీగా పెంచి ప్రజలకు వేసవి షాక్ ఇచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఏపీలో భారీగా విద్యుత్ ఛార్జీల పెంపు, పెట్రోల్, డీజిల్ రేట్లు బాదుడును దృష్టిలో పెట్టుకుని మరో పోస్ట్ చేసిన లోకేష్, వైయస్ జగన్ ఉగాది బాదుడు వీర బాదుడు అంటూ పేర్కొన్నారు. విద్యుత్ చార్జీల ధరలు పెంచుతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని లోకేష్ పేర్కొన్నారు.
జగన్ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలపై విద్యుత్ చార్జీల భారం
సీఎం జగన్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్న లోకేష్, జగన్ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పడుతోంది అంటూ మండిపడ్డారు. మాజీ సీఎం చంద్రబాబు హయాంలో విద్యుత్ చార్జీలు పెంచలేదని లోకేష్ గుర్తు చేశారు. జగన్ రకరకాల పన్నులు వేస్తూ ప్రజలపై మరింత భారం మోపుతున్నారని, ఎన్నికల హామీలను జగన్ తుంగలో తొక్కారని లోకేష్ విమర్శలు గుప్పించారు.