ఏడు కొండల వాడా.. వెంకట రమణా..! వీఐపీ బ్రేక్ దర్శన వివాదాన్ని నువ్వే పరిష్కరించాలి స్వామీ..!!
తిరుమల/హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్ధానంలో స్వామి వారి దర్శన భాగ్యం పై వివాదాలు చెలరేగుతున్నాయి. శ్రీవారి ఆలయం వీఐపీ బ్రేక్ దర్శన విధానం వివాదాస్పదమవుతోంది. గ్రేడింగ్ చేసి టీటీడీ ఇస్తున్న టిక్కెట్లపై భక్తుల నుంచి నిరసనలు పెరుగుతున్నాయి. అసలు గ్రేడింగ్ విధానం సరైనదేనా? శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు ప్రతి రోజు వేలమంది భక్తులు తిరులకు వస్తుంటారు. శ్రీవారి దర్శనం కోసం పలు క్యూలైన్లను భక్తులకు టీటీడీ అందుబాటులో ఉంచింది.
సర్వదర్శనం క్యూలైన్లు, నడకదారి భక్తుల కోసం, దివ్యదర్శనం క్యూలైన్లు, 300 రూపాయలు చెల్లించిన వారికి ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లు, చంటిబిడ్డల తల్లిదండ్రుల కోసం సుపథం మార్గం, వయో వృద్ధులు, వికలాంగుల కోసం మరో క్యైలైను.. ఇలా అనేక క్యూలైన్లను అధికారులు ఏర్పాటు చేశారు. సిఫారసు లేఖలపై దర్శనం కోసం నిత్యం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నారు.గతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం, సాయంత్రం ఉండగా సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నందున ఉదయానికి మాత్రమే పరిమితం చేసింది.
వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి టాప్ ప్రయారిటీ, ప్రయారిటీ, జనరల్ అంటూ వీఐపీ బ్రేక్ దర్శనాలను మూడు మూడు కేటగిరీలుగా విభజించారు. తర్వాత ఈ విధానాన్ని అధికారులు పక్కనపెట్టారు. కన్నాళ్లకు ఈ విధానం తిరిగి అమల్లోకి వచ్చింది. బ్రేక్ దర్శనాల కేటాయింపు తలనొప్పిగా మారింది. గత నెల రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 24 గంటలకుపైగా వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో బ్రేక్ దర్శనాల కేటాయింపులు కుదించాలని అధికారులు భావించారు.
ఇదే సమయంలో ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. ఫలితంగా టిక్కెట్ల కేటాయింపులపై అధికారులు నియంత్రణ విధించలేకపోతున్నారు. బ్రేక్ దర్శన టిక్కెట్లను వివిధ కేటగిరీలుగా జారీ చేస్తూ.. దర్శనం చేయిస్తుండడంతో సమయం అధికమవుతోంది. దీంతో సామాన్య భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచిఉండే సమయం రెట్టింపు అవుతోంది. అందుకే ఈ విధానంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ ఒకే దర్శనాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. దీంతో టీటీడీ పున:సమీక్షించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.