సమ్మె ఎఫెక్ట్: మరో 3రోజులకు శ్రీవారి లడ్డూ తయారీ నిలిచిపోనుందా!
గడచిన ఎనిమిది రోజులుగా జరుగుతున్న సరుకు రవాణా లారీల యాజమాన్యాల సమ్మె ప్రభావం తిరుమల తిరుపతి దేవస్థానంపైనా తీవ్రంగా పడింది. సమ్మె కారణంగా తిరుమలలో నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడింది.
హైదరాబాద్: గడచిన ఎనిమిది రోజులుగా జరుగుతున్న సరుకు రవాణా లారీల యాజమాన్యాల సమ్మె ప్రభావం తిరుమల తిరుపతి దేవస్థానంపైనా తీవ్రంగా పడింది. సమ్మె కారణంగా తిరుమలలో నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడింది. రోజువారీ వితరణలో భాగమైన అన్న ప్రసాదాల తయారీకి సైతం ఇబ్బందులు తలెత్తాయి.
శ్రీవారి భక్తులకు షాక్: రూ.50 సుదర్శనం టికెట్లు రద్దు చేసిన టీటీడీ
అయితే, మరో మూడు రోజుల్లో సరుకులు తిరుమల కొండపైకి చేరుకోకుంటే, భక్తులు మహా ప్రసాదంగా భావించే లడ్డూల తయారీ కష్టమవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో పాటు మిగతా ప్రసాదాలైన పులిహోర, దద్దోజనం, కట్టెపొంగలి, దోశలు వంటి వాటి తయారీకి అవసరమయ్యే పదార్థాలు సైతం నిండుకున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలో నిత్యావసర సరుకులను ఎలాగైనా తిరుమల కొండపైకి తెప్పించేందుకు టీటీడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు సహకరించాలని టీటీడీ స్థానిక లారీ యజమానుల సంఘాన్ని కోరింది.
కాగా, తమ వద్ద మరో వారానికి పైగా సరిపడే నిల్వలు ఉన్నాయని చెబుతున్నా, అది బియ్యం, పప్పులు మాత్రమేనని, కూరగాయలకు కొరత ఉన్నట్టు తెలుస్తోంది. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ అభయమిస్తున్నప్పటికీ, నిండుకున్న నిత్యావసరాలతో అన్న ప్రసాదాల వితరణకు ఇబ్బందికర పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.