ప్రేమ వేధింపులు భరించలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ప్రేమ వేధింపులు భరించలేక ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
కర్నూలు: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వేధింపులు భరించలేక ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కోవెలకుంట్లలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
కోవెలకుంట్లకు చెందిన నాగమణి అనే విద్యార్థిని కళాశాలకు వెళ్లి వస్తున్న సమయంలో ప్రతిరోజూ ప్రశాంత్ అనే యువకుడు ప్రేమించాలని వేధింపులకు గురిచేసేవాడు. ఆమె అందుకు నిరాకరించినా వదిలిపెట్టకుండా ఆమె వెంటపడి వేధించాడు.
మంగళవారం కళాశాలకు వెళ్లి వస్తున్న సమయంలోనూ ప్రశాంత్ ఆమెను వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో ఆమె కోవెలకుంట్లలోని తన నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రశాంత్ వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని నాగమణి తల్లిదండ్రులు ఆరోపించారు.
నిందితుడిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంద్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన నాగమణికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం తల్లిదండ్రులను విచారించి కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా, ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు తెలిసింది.