మాచర్ల ఘర్షణ, విధ్వంసం: బ్రహ్మారెడ్డిపై హత్యాయత్నం కేసు, 2 ఎఫ్ఐఆర్లు నమోదు
గుంటూరు: పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం జరిగిన హింసాత్మక ఘటనలపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇంఛార్జీ బ్రహ్మారెడ్డి సహా తొమ్మిదిపై సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో ఏ-1గా బ్రహ్మారెడ్డిని పేర్కొన్నారు.
రేషన్ డీలర్ చల్లా మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. తమపై బ్రహ్మారెడ్డి, బాబూఖాన్లు ఇనుపరాడ్లతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు చల్లా మోహన్. గుర్తు తెలియని దుండగులు టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వడంతో తామే రాళ్లు వేశామనే ఉద్దేశంతో బ్రహ్మారెడ్డి తమపై దాడి చేశారని తెలిపారు.
ఇక మరో కేసులో మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురక కిశోర్పై కేసు నమోదైంది. టీడీపీ కార్యాలయంపై దాడి, వాహనాల ధ్వంసం, అపార్ట్మెంట్లోకి చొరబడి చేసిన విధ్వంసాలపై కేసు నమోదైంది. తురక కిశోర్ తోపాటు 10 మందిపై 323, 448, 143, 147 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ-1గా తురక కిశోర్, ఏ-2గా చల్లా మోహన్ని పేర్కొన్నారు. ఎర్రం అన్నపూర్ణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.
అయితే, మాచర్ల ఘటనలో టీడీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి.. వైసీపీ నేతలపై నామ మాత్రం సెక్షన్ల కింద కేసులు పెట్టారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.