తిరుపతి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం- భక్తులకు సూచనలు
Maha Shivratri 2025: ఈ నెల 26వ తేదీన మహా శివరాత్రి. ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తుతుంటాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, మహానంది, క్షీరారామం, సోమారామం, అమరేశ్వర స్వామి, అమరలింగేశ్వర స్వామి, కోటప్ప కొండ, యాగంటి, శ్రీముఖం..వంటి ఆలయాలు భక్తుల సందడితో కోలాహలంగా మారుతుంటాయి.
ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తిరుపతి కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నెల 18వ తేదీన సాయంత్రం అంకురార్పణతో ఈ తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. దీనికి సంబంధించిన రోజువారీ షెడ్యూల్ను విడుదల చేశారు.

కపిలతీర్థంలో ఈ నెల ఫిబ్రవరి 19 నుండి 28వ తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 18న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది. అలాగే 15వ తేదీన కపిలతీర్థం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
19న ఉదయం- ధ్వజారోహణం, రాత్రి హంస వాహనంపై స్వామివారు ఊరేగుతారు. 20న ఉదయం- సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై దర్శనం ఇస్తారు. 21న ఉదయం- భూత వాహనం, రాత్రి సింహ వాహనంపై కపిలేశ్వర స్వామివారు భక్తులను కటాక్షిస్తారు.
22న ఉదయం- మకర వాహనం, రాత్రి శేష వాహనం, 23న ఉదయం- తిరుచ్చి ఉత్సవం, రాత్రి- నంది వాహన సేవను నిర్వహిస్తారు. 24న ఉదయం- వ్యాఘ్ర వాహనం, రాత్రి గజ వాహనంపై కపిలేశ్వర స్వామివారిని ఊరేగిస్తారు. 25న ఉదయం- కల్పవృక్ష వాహనం, రాత్రి అశ్వ వాహన సేవలు ఉంటాయి.
26న ఉదయం రథోత్సవం కన్నుల పండువగా సాగుతుంది. రాత్రి నందివాహనంపై స్వామివారు ఊరేగుతారు. 27న ఉదయం పురుషా మృగవాహనం, సాయంత్రం కల్యాణోత్సవం ఉంటుంది. రాత్రి తిరుచ్చి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 28న ఉదయం త్రిశూల స్నానం, సాయంత్రం ధ్వజావరోహణం, రాత్రి రావణాసుర వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు.
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం చేశారు. అనంతరం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయం, ధ్వజస్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు. అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చారు.
బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ ఉన్నతాధికారులు ఇదివరకే సమీక్షలను సైతం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యక్షంగా పనులను పర్యవేక్షించారు. ఆలయ పుష్కరిణిని పరిశుభ్రంగా ఉంచాలని, ఆకర్షణీయంగా పెయింటింగ్, రంగోళీలు, స్వామివారి వాహనాల మరమ్మత్తులు, పెయింటింగ్, విద్యుత్ కాంతులు, ఫ్లెక్సీలు, పటిష్టంగా క్యూలైన్లు, తిరుపతి నగరంలోని ప్రధాన కూడళ్లలో ఆర్చ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు.
భక్తులకు వేసవి నేపథ్యంలో చలువ పందిళ్లు, తాగునీరు, అన్నప్రసాదాలు అందించేందుకు వీలుగా సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. పెండింగ్ పనులు ఉంటే తక్షణలు అనుమతులు తీసుకుని భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అంతకుముందు ఫుష్కరిణి క్లీనింగ్, క్యూలైన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.












Click it and Unblock the Notifications