కాపుల మెజార్టీ ఓట్లు వైసీపీకే : ఎగ్జిట్ పోల్స్ లో సంచలన సమీకరణాలు: ఎవరు ఎటువైపు..!
ఏపీలో ఎన్నికలు అంటేనే సామాజిక సమీకరణం. సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకోవటం ఇక్కడి పార్టీలు అనుసరించే విధానం. అయితే గతం కంటే భిన్నంగా ఏపీలో సామాజిక వర్గాలు తమ మద్దతు ప్రకటించాయి. అనేక సర్వే సంస్థలు వెల్లడించిన ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో ఈ విషయం స్పష్టమైంది. జనసేన అధినేతకు ప్రదానంగా మద్దతుగా నిలుస్తారని భావించిన కాపు సామాజిక వర్గం ఈసారి ఎక్కువ శాతం వైసీపీకి మద్దతుగా నిలిచినట్లు తేలింది. ఇక, మిగిలిన వర్గాల సమీకరణాలు సైతం గతం కంటే మారిపోయాయి.
కాపులు మెజార్టీ మద్దతు వైసీపీకే..
ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సర్వే సంస్థలు ఏపీలో ఏ సామాజిక వర్గం ఏ పార్టీకి మద్దతుగా నిలిచిందో విశ్లేషించాయి. ఏపీ లో కాపు సామాజిక వర్గం జనసేనకే మద్దతు పలుకుతారని ఫలితంగా ఆ వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసారు. అయితే, ఆశ్చర్యకరంగా కాపు ఓట్ షేర్లో వైసీపీకి 47.30 శాతం పోలవ్వగా, టీడీపీకి 39.39 శాతం పోలయినట్లు అంచనా వేస్తున్నారు. ఇక, జనసేనకు కేవలం 12.41 శాతం మాత్రమే పోలయినట్లు విశ్లేషించారు. కాపు రిజర్వేషన్లకు జగన్ వ్యతిరేకమని ప్రచారం చేసినా..టీడీపీ కాపులకు రిజర్వేషన్లు ఇచ్చిందని ప్రచారం చేసినా..కాపు కార్పోరేషన్ ద్వారా నిధులు ఇచ్చామని చెప్పినా కాపులు వైసీపీకి మద్దతు ప్రకటించటం ప్రత్యేక సమీకరణంగానే చెప్పుకోవాలి. ఇక, రెడ్డి సామాజిక వర్గంలో 73.80 శాతం వైసీపికి, 21.79 శాతం టీడీపీకి, 2.91 శాతం జనసేనకు అండగా నిలిచారు. కమ్మ వర్గం ఓటర్లు అధికంగా టీడీపీకి 67.11 శాతం, 28.37 శాతం వైసీపీకి, 3.40 శాతం జనసేనకు మద్దతుగా నిలిచినట్లు అంచనా వేసారు.
మైనార్టీల మద్దతు సైతం ఫ్యాన్కే..
ఏపీ ఎన్నికల్లో మైనార్టీల్లోని 57.96 శాతం వైసీపీకి, టీడీపీకి 37.75 శాతం, 3.61 శాతం జనసేనకు మద్దతుగా నిలిచినట్లు అంచనాలు వెల్లడిస్తున్నాయి. మాల వర్గంలో 62.45 శాతం వైసీపీతో, 31.57 శాతం టీడీపీతో, 4.28 శాతం జనసేనకు మద్దతిచ్చారు. మాదిగ సామాజిక వర్గంలో 56.94 శాతం వైసీపీకి, 36.74 శాతం టీడీపీకి, 4.86 శాతం జనసేనకు మద్దతుగా నిలిచినట్లు ఎగ్జిట్ పోల్స్లో విశ్లేషించారు. ఇక, బీసీలు తమ వైపే అని చెప్పుకొనే టీడీపీని కాదని..అధిక శాతం మంది వైసీపీకి మద్దతుగా నిలిచినట్లు తేల్చారు. యాదవ వర్గంలో 49.49 శాతం వైసీపీకి, 44.34 శాతం టీడీపీకి, 3.90 శాతం జనసేనకు అండగా నిలిచారు. గౌడ..శెట్టి బలిజ వర్గంలో 47.48 శాతం వైసీపీ, 44.26 శాతం టీడీపీ, 6.45 శాతం జనసేనతో మద్దతుగా నిలిచారు. పద్మశాలి వర్గంలో 4.53 శాతం వైసీపీ, 45.38 శాతం టీడీపీ, 7.11 శాతం జనసేనతో ఉన్నారు. ఇక, రాయలసీమలో ఎక్కువగా ఉండే బోయ వర్గంలో 52.78 శాతం వైసీపీకి మద్దతుగా నిలవగా, 38.49 శాతం టీడీపీతో ఉన్నారుద. ఇక, 3.35 శాతం మంది జనసేనకు మద్దతు ప్రకటించినట్లు సర్వేల అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.
మహిళా..పురుష ఓటర్లు కూడా..
ఏపీలో జరిగిన పోలింగ్లో మహిళలు ఎక్కవ శాతం పోలింగ్కు తరలి రావటంతో వారి ఓట్లు ఎవరికి పడ్డాయనే చర్చ కీలకంగా మారింది. అయితే ఎగ్జిట్ ఫలితాల అంచనాల ప్రకారం పురుషుల్లో 50.03 శాతం వైసీపీ వైపు ఉండగా, 39.69 శాతం మంది టీడీపీకి, 7.71 శాతం మంది జనసేనకు మద్దతు ప్రకటించారు. ఇక, మహిళా ఓటర్లలో 48.95 శాతం మంది వైసీపీతో నిలవగా, 45.06 శాతం టీడీపీకి మద్దతు ప్రకటించారు. జనసేనకు 3.88 శాతం మంది మహిళలు మద్దతుగా నిలిచినట్లు సర్వే అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.